Sunil Gavaskar : టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మరోసారి ఆస్ట్రేలియాపై విరుచుకుపడ్డాడు. ఈసారి అతను ఆసీస్ సెలెక్టర్లను టార్గెట్ చేశాడు. గాయపడిన క్రికెటర్లను భారత సిరీస్కు ఎంపిక చేసినందుకు ఆస్ట్రేలియా సెలెక్టర్లు మూకుమ్మడిగా రాజీనామా చేయాలని అతను అన్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోని ఫాస్ట్ బౌలర్లు జోష్ హేజిల్వుడ్, మిచెల్ స్టార్క్, ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్లను బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీకి సెలక్ట్ చేయడాన్ని గవాస్కర్ తప్పుపట్టాడు.
‘ఆసీస్ సెలెక్టర్లకు బాధ్యత అనేది ఉంటే వెంటనే పదవి నుంచి తప్పుకోవాలి. ఒకవేళ ఆస్ట్రేలియా జట్టు ఆఖరి టెస్టులో కూడా విజయం సాధించి సిరీస్ సమం చేసినా కూడా వాళ్లు తమ పోస్టులకు రాజీనామా చేయాలి’ అని గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇండోర్ పిచ్కు ఐసీసీ మూడు డీమెరిట్ పాయింట్లు ఇవ్వడంపై ఈ మాజీ క్రికెటర్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇండోర్కు మూడు పాయింట్లు సరే. మరి గబ్బా పిచ్కు ఎన్ని డీమెరిట్ పాయింట్లు ఇస్తారని ఆయన ఐసీసీని ప్రశ్నించాడు.
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీకోసం ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్, హేజిల్వుడ్, ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ను ఆసీస్ సెలెక్టర్లు ఎంపిక చేశారు. స్వదేశంలో దక్షిణాఫ్రికా సిరీస్లో గాయపడిన వాళ్లు పూర్తిగా కోలుకోకున్నా కూడా వాళ్లను సెలక్ట్ చేశారు. దాంతో, భారత పర్యటనకు వచ్చినా కూడా గాయం కారణంగా తొలి రెండు టెస్టులు ఆడలేదు. హేజిల్వుడ్ ఇప్పటికే సిరీస్కు దూరమయ్యాడు. కీలకమైన మూడో టెస్టుకు కెప్టెన్ కమిన్స్, ఓపెనర్ డేవిడ్ వార్నర్ దూరం అయ్యారు. దాంతో, స్టార్క్, గ్రీన్ గాయంతోనే ఇండోర్ టెస్టు ఆడారు. ఆ మ్యాచ్లో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో గెలిచింది.
నాగ్పూర్ టెస్టులో జడేజా, అశ్విన్ దెబ్బకు ఆసీస్ ఇన్నింగ్స్ 162 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఢిల్లీ టెస్టులో భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలిచంది. దాంతో, నాలుగు టెస్టుల సిరీస్లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. చివరి టెస్టు అహ్మదాబాద్లో మార్చి 9న జరగనుంది. మూడో టెస్టులో జట్టును గెలిపించిన స్టీవ్ స్మిత్ ఆఖరి టెస్టులో కూడా కెప్టెన్సీ చేయనున్నాడు. ఇండోర్ టెస్టు విజయంతో ఆసీస్ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు దూసుకెళ్లింది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రెండో స్టానంలో ఉన్న భారత్ ఫైనల్ చేరాలంటే ఆఖరి టెస్టులో నెగ్గాల్సిందే. ఈ ఏడాది జూన్లో ఇంగ్లండ్లోని ఓవల్ స్టేడియంలో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది.