DC vs MI : మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) హవా కొనసాగిస్తోంది. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆ జట్టు ఈ టోర్నమెంట్లో హ్యాట్రిక్ విక్టరీ కొట్టింది. తొలి రెండు మ్యాచుల్లో గెలిచి సమఉజ్జీగా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)ను చిత్తుగా ఓడించింది. 106 పరుగుల టార్గెట్ను మరో ఐదు ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించింది. ముంబై మూడు విజయాలు, ఆరు పాయింట్లతో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్లో విఫలమైన ఢిల్లీ ఈ టోర్నీలో తొలి ఓటమి మూటగట్టుకుంది.
డబ్ల్యూపీఎల్ ఏడో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బలమైన ఢిల్లీ క్యాపిటల్స్ను దారుణంగా ఓడించింది. ముంబై బౌలింగ్ ధాటికి రెండు మ్యాచుల్లో రెండొందలు కొట్టిన ఢిల్లీ చేతులేత్తేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆ జట్టు105 పరుగులకు ఆలౌట్ అయింది. ముంబై బౌలర్లు సాయిక్ ఇషక్, ఆల్రౌండర్ హేలీ మాథ్యూస్ ఇసీ వాంగ్ తలా మూడు వికెట్లు తీసి ఢిల్లీని దెబ్బకొట్టారు. దాంతో, 18 ఓవర్లకే ఆ జట్టు కుప్పకూలింది. ఢిల్లీ టీమ్లో కెప్టెన్ మేగ్ లానింగ్ (43), జెమీమా రోడ్రిగ్స్ (25) మాత్రమే రాణించారు.
స్వల్ప లక్ష్య ఛేదనలో ముంబైకి ఓపెనర్లు యస్తికా భాటియా (41), హేలీ మాథ్యూస్ (31) శుభారంభం ఇచ్చారు. రెండు మ్యాచుల్లో విఫలమైన యస్తిక ఫోర్లతో ఢిల్లీ బౌలర్లపై విరుచుకు పడింది. మాథ్యూస్, యస్తికా పోటాపోటీగా బౌండరీలు కొడుతూ ఢిల్లీని ఒడ్తిడిలోకి నెట్టారు. ధాటిగా ఆడుతున్న యస్తికను తారా నోరిస్ వే ఎల్బీగా ఔట్ చేసింది. దాంతో 65 పరుగుల ముంబై తొలి వికెట్ పడింది. యస్తిక అవుట్ అయ్యేసరికి ఆ జట్టు విజయానికి 60 బంతుల్లో 31 రన్స్ కావాలి. ఆ వెంటనే మాథ్యూస్ పెవిలియన్ చేరింది. వాళ్లు ఔటయ్యాక నాట్ సీవర్ బ్రంట్ (23), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (11) జట్టును విజయ తీరాలకు చేర్చారు. 15వ ఓవర్ ఐదో బంతికి బ్రంట్ ఫోర్ కొట్టడంతో స్కోర్లు సమం అయ్యాయి. ఆఖరి బంతికి కూడా ఆమె బౌండరీ బాదడంతో ముంబై 109 రన్స్ చేసింది. 8 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది.
మొదటి రెండు మ్యాచుల్లో రెండొందలు బాదిన ఢిల్లీ క్యాపిటల్స్ మూడో మ్యాచ్లో విఫలం అయింది. ఓపెనర్ ఫఫాలీ వర్మ (2), యూపీ వారియర్స్పై చెలరేగిన జొనాసెన్ (2 స్వల్ప స్కోర్కే వెనుదిరిగారు. 31 పరుగులకే మూడు వికెట్లు పడ్డాయి. ఒకవైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ లానింగ్(43) ఒంటరి పోరాటం చేసింది. జెమీమా రోడ్రిగ్స్ (25)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకుంది. కానీ ఆమె జట్టు స్కోర్ 84 వద్ద ఔట్ అయింది. ఆ తర్వాత ఆ జట్టు ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతో సమయం పట్టలేదు. ముంబై ఇండియన్స్ బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తూ ఢిల్లీ బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టారు. దాంతో, ఢిల్లీ ప్లేయర్స్ ఒక్కొక్కరుగా పెవిలయన్కు క్యూ కట్టారు.