IND vs AUS : బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా సెంచరీ(104 నాటౌట్)తో జట్టును ఆదుకున్నాడు. ఓపికగా ఆడిన అతను భారత బౌలర్లకు పరీక్ష పెట్టాడు. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (38), ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్(49)తో కలిపి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. తొలి రోజు ఆట ముగిసే సరికి ఆస్ట్రేలియా 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. భారత బౌలలర్లలో మహమ్మద్ షమీ రెండు వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ తలా ఒక వికెట్ తీశారు.
అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఆఖరి టెస్టులో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ధాటిగా ఆడుతున్న ట్రావిస్ హెడ్(32), అశ్విన్ ఓవర్లో వెనుదిరిగాడు. దాంతో, 61 పరుగుల వద్ద ఆ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. మరో 11 రన్స్కే వరల్డ్ నంబర్ 1 బ్యాటర్ లబుషేన్ (3) ఔటయ్యాడు. అతడిని షమీ బౌల్డ్ చేశాడు. 72 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్ను కెప్టెన్ స్మిత్, ఖవాజా ఆదుకున్నారు.
మూడో టెస్టులో అర్ధ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడిన ఖవాజా కీలకమైన నాలుగో టెస్టులోనూ చెలరేగాడు.
స్మిత్తో కలిసి మూడో వికెట్కు రన్స్ 79 జోడించాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని జడేజా విడదీశాడు. స్మిత్ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే పీటర్ హ్యాండ్స్కాంబ్(17)ను షమీ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత గ్రీన్తో జతకట్టిన ఖవాజా స్కోర్బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ సిరీస్లో శతకం బాదిన తొలి ఆస్ట్రేలియా క్రికెటర్గా ఖవాజా గుర్తింపు సాధించాడు. అంతేకాదు గత పదమూడేళ్లలో భారత్లో ఆడిన 12 టెస్టుల్లో సెంచరీ కొట్టిన ఆసీస్ మొదటి ఎడమచేతి వాటం ఆటగాడిగా ఖవాజా రికార్డు క్రియేట్ చేశాడు.