Indonesia : గత ఏడాది ఇండోనేషియా ఫుట్బాల్ స్టేడియంలో జరిగిన ప్రమాదంలో వందమందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. ప్రపంచం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన స్టేడియం తొక్కిసలాట (Indonesia foot ball stampede) కేసులో ఆ దేశ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. నిర్లక్ష్యంగా వ్యవహరించి, ప్రమాదానికి కారణమైన ఇద్దరు అధికారులకు జైలు శిక్ష విధించింది. మ్యాచ్ అధికారి అబ్దుల్ హ్యారిస్కు 18 నెలలు, భద్రతా అధికారి సుకో సుత్రిస్నోకు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ‘వీళ్ల ఇద్దరి నిర్లక్ష్యం కారణంగానే అంతమంది చనిపోయారు. చాలామంది గాయపడ్డారు’ అని జడ్జి అబు అచ్మంద్ సిద్దిఖీ హంస్య అన్నాడు.
ఈ విషాద ఘటనతో ప్రమేయం ఉన్న ముగ్గురు పోలీసులపై కూడా కేసు నమోదు చేశారు. వీళ్లపై మరికొద్ది రోజుల్లో చర్యలు తీసుకోనున్నారు. హ్యారిస్, సుకోలు అరెమా ఫుట్బాల్ క్లబ్కు చెందినవాళ్లు. ప్రమాద అనంతరం ప్రజాగ్రహం పెల్లుబికడంతో ఈ ఇద్దరినీ ఫుట్బాల్ సంబంధ కార్యకలాపాల్లో పాల్గొనకుండా చేశారు. వీళ్లపై ఇండోనేషియా ఫుట్బాల్ సమాఖ్య ఇప్పటికే జీవితకాల నిషేధం విధించింది.
పోయిన ఏడాది అక్టోబర్లో మలంగ్ ఫుట్బాల్ స్టేడియంలో అరెమా ఫుట్బాల్ క్లబ్, పెర్సెబయ సురబయ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు వచ్చారు. వాళ్లను కంట్రోల్ చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దాంతో, ఆందోళకు గురైన ఫ్యాన్స్ భయంతో ఒక్కసారిగా పరుగులు తీశారు. ఈ సమయంలో జరిగిన తొక్కిసలాటలో 135 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలియడంతో ప్రజలు దేశ వ్యాప్తంగా నిరసనకు దిగారు. ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. దాంతో, ఇండోనేషియా ప్రభుత్వం ప్రమాదానికి కారణమైన వాళ్లపై చర్యలకు ఉపక్రమించింది. పోలీసులు 45 రౌండ్ల పాటు టియర్ గ్యాస్ ప్రయోగించడమే తొక్కిసలాటకు ప్రధాన కారణం అని మానవ హక్కుల కమిషన్ తెలిపింది.