PCB New Chairman: వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత వరుస వైఫల్యాలకు తోడు జట్టులో విభేదాలు, వర్గాలవారీగా విడిపోయి పరవు పోగొట్టుకుంటున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు కొత్త అధ్యక్షుడు వచ్చాడు. నేడు లాహోర్ వేదికగా ముగిసిన పీసీబీ అధ్యక్ష ఎన్నికలలో సయిద్ మోహ్సిన్ రజా నఖ్వీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కొత్త చైర్మన్గా నియమితుడయ్యాడు. బోర్డు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. పీసీబీకి 37వ అధ్యక్షుడిగా ఎన్నికైన నఖ్వీ.. నేటి నుంచి మూడేండ్ల పాటు పదవిలో కొనసాగనున్నాడు.
పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నఖ్వీ.. ఎంపిక గత నెలలోనే పూర్తైనా అధికారికంగా ఎన్నికల ప్రక్రియ నేడు ముగిసింది. పీసీబీ తాత్కాలిక చీఫ్గా ఉన్న షా ఖవర్ ఆధ్వర్యంలో అధ్యక్ష ఎన్నికలకు ఓటింగ్ జరుపగా బోర్డు సభ్యులు ఏకగ్రీవంగా నఖ్వీని ఎన్నుకున్నారు. 2022లో రమీజ్ రాజా తర్వాత పీసీబీకి ఫుల్ టైమ్ చైర్మన్గా ఎన్నికైంది నఖ్వీనే కావడం గమనార్హం. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవి నుంచి దిగిపోయాక రమీజ్ రాజా సైతం వైదొలగాల్సి వచ్చింది. అతడి స్థానంలో నజమ్ సేథీ సుమారు ఏడాదిపాటు పీసీబీ చీఫ్గా వ్యవహరించారు. ఆ తర్వాత జకా అష్రఫ్ ఆ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఏడాది జనవరి 19న అష్రఫ్ తన పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే.
Mr Syed Mohsin Raza Naqvi has been elected unanimously and unopposed as the Pakistan Cricket Board’s 37th Chairman today. pic.twitter.com/caa01d8XZu
— Pakistan Cricket (@TheRealPCB) February 6, 2024
పీసీబీ చీఫ్గా ఎన్నికవడంపై నఖ్వీ స్పందిస్తూ… ‘పీసీబీ చైర్మన్గా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మెంబర్స్కు ధన్యవవాదాలు. నా మీద నమ్మకముంచినందుకు కృతజ్ఞుడను. దేశంలో క్రికెట్ అభివృద్ధితో పాటు పాకిస్తాన్ క్రికెట్లో ప్రొఫెషనలిజం తీసుకురావడానికి నావంతు కృషి చేస్తా..’అని చెప్పాడు. 45 ఏండ్ల నఖ్వీ.. గతంలో అమెరికా వేదికగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సీఎన్ఎన్ ఛానెల్లో విధులు నిర్వర్తించాడు. ఆ తర్వాత పాకిస్తాన్కు వచ్చి పత్రికతో పాటు టీవీ ఛానెల్స్ను ఏర్పాటుచేశాడు. పాకిస్తాన్లోని 24 న్యూస్ ఛానెల్ ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్నదే..