India Tour Of South Africa: వన్డే ప్రపంచకప్, స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్ ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు తర్వాతి టాస్క్ దక్షిణాఫ్రికా టూర్. ఇంతవరకూ సఫారీ గడ్డమీద టెస్టు సిరీస్ నెగ్గని భారత్.. ఈసారైనా ఆ కలను తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. కానీ ఈ టూర్కు ముందే భారత్కు భారీ షాకులు తప్పేలా లేవు. పేసర్లకు స్వర్గధామంగా ఉండే సఫారీ పిచ్లపై టీమిండియాకు ఇద్దరు పేసర్లు దూరమయ్యే అవకాశం ఉంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో దీపక్ చాహర్, టెస్టులలో మహ్మద్ షమీలు సౌతాఫ్రికా టూర్కు వెళ్లేది అనుమానమేనని వార్తలు వస్తున్నాయి.
ఇటీవలే ముగిసిన ప్రపంచకప్లో దుమ్మురేపిన షమీ.. చీలమండ గాయంతో బాధపడుతున్నాడు. వరల్డ్ కప్లోనే అతడిని గాయం వేధించినా షమీ దానితోనే నెట్టుకొచ్చాడు. కానీ దక్షిణాఫ్రికా సిరీస్కు మాత్రం షమీ వెళ్లేది అనుమానమేనని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. టెస్టు జట్టులో ఉన్న షమీ.. బెంగళూరులో ఉన్న నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఫిట్నెస్ టెస్టు నిరూపించుకుంటే అతడు సఫారీ టూర్ వెళ్లే అవకాశముందని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. టెస్టు జట్టు దక్షిణాఫ్రికాకు వెళ్లడానికి ఇంకా టైముంది. ఆ లోపు షమీ ఎన్సీఏలో రిపోర్ట్ చేసి ఆ తర్వాత అతడి ఫిట్నెస్ను సమీక్షించి దక్షిణాఫ్రికాకు పంపనున్నట్టు తెలుస్తున్నది.
Deepak Chahar’s father is ill, so he missed the 5th T20 vs Australia and likely to miss the South Africa series as well. [Sports Tak] pic.twitter.com/f691qNJxxB
— Johns. (@CricCrazyJohns) December 5, 2023
చాహర్ కూడా డౌటే..
పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు ఎంపికైన దీపక్ చాహర్ కూడా దక్షిణాఫ్రికా టూర్ కు వెళ్లేది అనుమానమే. చాహర్ తండ్రి లోకేంద్ర సింగ్ మూడు రోజుల క్రితం అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరాడు. బ్రెయిన్ స్ట్రోక్కు గురైన లోకేంద్ర సింగ్ ప్రస్తుతం అలీగఢ్లో చికిత్స పొందుతున్నాడు. చాహర్ తండ్రి బాగోగులు చూసుకునేందుకు ఇక్కడే ఉన్నాడు. ఇదే విషయాన్ని అతడు బీసీసీఐ సెలక్టర్లతో పాటు టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రావిడ్కు కూడా చెప్పినట్టు మీడియాకు వెల్లడించాడు. తనకు తండ్రే ముఖ్యమని, ఆయనను ఈ పరిస్థితులలో వదిలి సౌతాఫ్రికాకు వెళ్లేది కష్టమేనని తేల్చి చెప్పాడు.