హైదరాబాద్, ఆట ప్రతినిధి: దేశంలో అత్యుత్తమ క్రీడా పాలసీని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దైనందిన జీవితంలో ఆటలను అంతర్భాగం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. నిత్యం చదువులతో కుస్తీ పడుతున్న పిల్లలకు ఆటవిడుపు అందించేందుకు క్రీడల వైపు మొగ్గుచూపేలా చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా మంగళవారం హైదరాబాద్లో క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ అధ్యక్షతన క్యాబినెట్ సబ్కమిటీ సమావేశమైంది. రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్రావు, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పాల్గొన్నారు. సుదీర్ఘంగా సాగిన భేటీలో అత్యుత్తమ క్రీడా పాలసీని తీసుకు రావడంపై చర్చించారు. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ పలు కీలక సూచనలు చేశారు. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ఆరోగ్యకరంగా ఉండేందుకు ఆటలు ఎంతగానో దోహదం చేస్తాయని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే క్యాబినెట్ సబ్కమిటీ భేటీలో పాల్గొన్న మంత్రులు శ్రీనివాస్గౌడ్, దయాకర్రావు, సబితాఇంద్రారెడ్డి పలు అంశాలను ప్రస్తావించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి మెరికల్లాంటి క్రీడాకారులు రావాలంటే అక్కడి యువతకు కావాల్సిన పరికరాలు, వసతులు కల్పించాలన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా పల్లెల్లో మైదానాల నిర్మాణంలో యువకుల సహకారం తీసుకోవాలన్నారు. ప్లేయర్లను మాత్రమే కాదు కోచ్లను గుర్తించి గౌరవించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్విమ్మింగ్ను బాగా ప్రోత్సహించాలని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ‘గ్రామాల్లో వాటర్ స్పోర్ట్స్ను అభివృద్ధి చేయాలి. ఇప్పటికే రాష్ట్రం బ్యాడ్మింటన్, టెన్నిస్, బాక్సింగ్, షూటింగ్, రోయింగ్ లాంటి క్రీడలకు పేరుగాంచింది. మిగతా క్రీడల్లోనూ అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. వచ్చే సబ్ కమిటీ భేటీలో డ్రాఫ్ట్ పాలసీ రూపొందించి రానున్న అసెంబ్లీ సమావేశాల కంటే ముందు క్యాబినెట్లో ఆమోదం తీసుకోవాలి’ అని అధికారులను సబ్కమిటీ సభ్యులు ఆదేశించారు.