Test Cricket: క్రికెట్లో చట్టాలు రూపొందించే ది మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) టెస్టు క్రికెట్ పదికాలాల పాటు వర్ధిల్లేందుకు కీలక సూచనలు చేసింది. ద్వైపాక్షిక సిరీస్లలో భాగంగా రెండు టెస్టులకే పరిమితం కాకుండా కనీసం మూడు మ్యాచ్లు అయినా నిర్వహించాలని తాజాగా సూచించింది. ఇటీవల కాలంలో పలు దేశాలు టీ20లపై మోజుతో ద్వైపాక్షిక సిరీస్లలో టెస్టు, వన్డేలకు కుదించి టీ20లను ఎక్కువగా ఆడించడం, ఫ్రాంచైజీ లీగ్ల షెడ్యూల్ల పేరిట టెస్టులను పట్టించుకోలేకపోతున్నాయనే విమర్శల నేపథ్యంలో ఎంసీసీ ఈ మార్పులను ప్రతిపాదించింది. కొద్దిరోజుల క్రితం భారత్ – దక్షిణాఫ్రికాతో పాటు ఆస్ట్రేలియా – వెస్టిండీస్ మధ్య రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లే జరగ్గా.. తాజాగా న్యూజిలాండ్ – దక్షిణాఫ్రికా సైతం రెండు టెస్టులతోనే సరిపెట్టుకున్నాయి.
క్రికెట్ విమర్శకులు, విశ్లేషకులు సైతం ఒక సిరీస్లో కనీసం 3 మ్యాచ్లు అయినా ఉండాలని వాదిస్తున్న నేపథ్యంలో ఎంసీసీ తాజాగా స్పందించింది. ఎంసీసీ ప్రకటనలో… ‘బ్రిస్బేన్ (గబ్బాలో ఆస్ట్రేలియా – వెస్టిండీస్ మ్యాచ్), హైదరాబాద్ (భారత్-ఇంగ్లండ్) లలో ముగిసిన రెండు అద్భుత విజయాల తర్వాత మేం సమావేశమయ్యాం. టెస్టు మ్యాచ్లకు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన కొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది. ఆసీస్ – విండీస్ మధ్య మూడో టెస్టు ఉంటే బాగుండేదని ప్రేక్షకులు కూడా అనుకునేలా చేసింది. ప్రస్తుతం ఆడుతున్న ఉత్కంఠభరితమైన టెస్టు క్రికెట్కు మద్దతుగా అదే విధంగా ఈ ఫార్మాట్కు ఉన్న ప్రాముఖ్యతను కొనసాగించేందుకు గాను ఐసీసీ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (ఎఫ్టీపీ) లో టెస్టు సిరీస్లో కనీసం మూడు మ్యాచ్లు ఉండాలని మేం ప్రతిపాదిస్తున్నాం..’ అని తెలిపింది.
📝 The statements are available to read here: https://t.co/o432C4VWnS
— Marylebone Cricket Club (@MCCOfficial) February 9, 2024
గత నెలలో దక్షిణాఫ్రికా.. భారత్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడింది. తాజాగా న్యూజిలాండ్తోనూ అదే ఫార్ములాతో ఆడుతోంది. స్వదేశంలో ఆరు ఫ్రాంచైజీలతో ఆ దేశ క్రికెట్ బోర్డు ఎస్ఎ 20 (SA 20)ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఎస్ఎ 20 షెడ్యూల్ కోసం ఈ సిరీస్లను కుదించడం, కివీస్తో సిరీస్కు అయితే ఆ జట్టు రెగ్యులర్ ప్లేయర్లు ఈ మెగా టోర్నీలో ఆడుతుండటంతో కనీసం ఏడుగురు కొత్తమందిని పంపించింది. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంసీసీ తాజా ప్రకటన చర్చనీయాంశమైంది.