MLA Sabitha Indra Reddy | ఆర్కేపురం, ఏప్రిల్ 27: కేసీఆర్ గుర్తులను ఎవరూ చెరిపి వేయలేరని, తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం ఆర్కేపురం డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నగేశ్ ఆధ్వర్యంలో సురభీ హోటల్లో నిర్వహించారు. కార్యక్రమానికి సబితాఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వంద రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులకు పరిపాలన చేతగాక నిత్యం కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.
చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కు రంగారెడ్డి జిల్లాపై పూర్తి అవగాహన ఉన్నదని, అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే ప్రజల సమస్యలపై పార్లమెంట్లో గళం విపుతారన్నారు. సీఎం రేవంత్రెడ్డికి రాష్ట్ర పరిపాలనపై అవగాహన లేదని, ప్రజలకు ఏమి కావాలో తెలియని నాయకుడని చెప్పారు. 70 ఏండ్ల వయస్సులో కేసీఆర్ రాష్ట్రంలో పర్యటిస్తూ.. ఎండిన పంటలను పరిశీలిస్తుంటే.. సీఎం రేవంత్రెడ్డి ఐపీఎల్ మ్యాచ్లు చూస్తూ.. సేద తీరుతున్నారని మండిపడ్డారు. సమావేశంలో ఎమ్మెల్సీ దయానంద్గుప్తా, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ శ్రీధర్, బీఆర్ఎస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్శర్మ, నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ పటేల్ సునీతారెడ్డి, మహిళ అధ్యక్షురాలు లిక్కి ఊర్మిలారెడ్డి, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.