ఖైరతాబాద్, ఏప్రిల్ 27: బీసీల వాటా తేల్చాకే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లడుగాలని ఓయూ ఉద్యమ నేత, బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ డి మాండ్ చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శనివారం ‘స్థానిక సంస్థలు-రిజర్వేషన్లు’ అన్న అంశంపై జరిగిన రౌండ్టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో బీసీలకు పలు హామీలు ఇచ్చిందని తెలిపారు.
మొదటి అసెంబ్లీ సమావేశంలోనే బీసీ సభప్లాన్ నిధుల మంజూరు, బీసీ సంక్షేమానికి లక్ష కోట్లు, ఎంబీసీ సంక్షేమ మంత్రిత్వశాఖ ఏర్పాటు, బీసీ ప్రెస్క్లబ్లు, ఐక్యతా భవనా లు, స్టడీ సర్కిళ్లు, క్యాంటీన్ల స్థాపన, పాలక మండళ్ల నియామకాలు చేపడుతామని ఆ పార్టీ నేతలు హామీలు ఇచ్చారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మరిచారని గుర్తుచేశారు. బీసీలపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే సీఎం రేవంత్రెడ్డి స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. వివిధ బీసీ సంఘాల నేతలు సాయిని నరేందర్, దాసు సురేశ్, సంగెం సూర్యారావు, బత్తుల సిద్దేశ్వర్లు, సర్ధార్ పుటం పురుషోత్తం పటేల్, పాలూరు రామకృష్ణ, కిరణ్కుమార్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.