దుబాయ్: టీమ్ఇండియా యువ క్రికెటర్ స్మృతి మందన… మళ్లీ మెరిసింది. అంతర్జాతీయ క్రికెట్లో తనదైన సూపర్ ఫామ్తో అదరగొడుతున్న మందనను ప్రతిష్ఠాత్మక ఐసీసీ ‘వుమన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’అవార్డు వరించింది. ఫార్మాట్తో సంబంధం లేకుండా పరుగుల వరద పారించిన ఈ డాషింగ్ క్రికెటర్ తన కెరీర్లో రెండోసారి ఐసీసీ అవార్డును సొంతం చేసుకుంది. టామీ బ్యూమౌంట్ (ఇంగ్లండ్), లిజెల్లీ లీ(దక్షిణాఫ్రికా), గాబీ లెవిస్ (ఐర్లాండ్)ను అధిగమిస్తూ మందన..‘రాచెల్ హేహో ఫ్లింట్’ట్రోఫీని దక్కించుకున్నట్లు ఐసీసీ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. వెటరన్ పేసర్ జులన్ గోస్వామి (2017) తర్వాత ఐసీసీ అవార్డు దక్కించుకున్న రెండో భారత క్రికెటర్గా మందన నిలిచింది. దీంతోపాటు ఓవరాల్ విభాగంలో అవార్డు ఖాతాలో వేసుకున్న రెండో మహిళా ప్లేయర్గా రికార్డుల్లోకెక్కింది. గతేడాది మొత్తం 22 మ్యాచ్ల్లో 38.86 సగటుతో ఈ యువ ఓపెనర్ 855 పరుగులు చేసింది. ఇందులో సెంచరీ సహా ఐదు అర్ధసెంచరీలు ఉన్నాయి. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్తో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియాపై మందన అంచనాలకు తగ్గట్టు రాణించింది. ముఖ్యంగా ఆసీస్తో గులాబీ బంతితో డే అండ్ నైట్ టెస్టులో సెంచరీ కొట్టి ఔరా అనిపించింది. ఈ ఫీట్ సాధించిన తొలి భారత బ్యాటర్గా అరుదైన ఘనత సొంతం చేసుకుంది. ఐసీసీ అవార్డుపై మందన స్పందిస్తూ ‘ప్రతిష్టాత్మక అవార్డు కైవసం చేసుకోవడం చాలా గర్వంగా ఉంది. భవిష్యత్లోనూ టీమ్ఇండియా విజయాల్లో భాగమవుతూ మరింత మెరుగ్గా రాణిస్తా’ అని అంది.