DC vs RCB : మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళురు (Royal Challengers Bangalore) రాత మారలేదు. వరుసగా ఐదో ఓటమి మూటగట్టుకుంది. ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) 6 వికెట్ల తేడాతో ఆర్సీబీపై గెలిచింది. మరిజానే కాప్ (32), జెస్ జొనాసెన్ (29)… చివరి దాకా క్రీజులో నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చారు. జెమీమా రోడ్రిగ్స్ (32), అలిసే క్యాప్సే (38) రాణించారు.
151 టార్గెట్తో బరిలోకి దిగిన ఢిల్లీకి తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. మేగన్ షట్ రెండో బంతికే ఓపెనర్ షఫాలీని బౌల్డ్ చేసింది. 70 పరుగులకే మూడు వికెట్లు పడిన దశలో జెమీమా రోడ్రిగ్స్, మరిజానే కాప్ నాలుగో వికెట్కు 39 రన్స్ జోడించింది. వీళ్లు ధాటిగా ఆడి స్కోర్బోర్డును పరుగులు పెట్టించారు. 109 వద్ద నాలుగో వికెట్ పడింది. కెప్టెన్ మేగ్ లానింగ్ (15) ఔట్ అయింది.
జెమీమా ఔటయ్యాక మరిజానే కాప్, జొనాసెన్ మ్యాచ్ గెలిపించే బాధ్యత తీసుకున్నారు. వీళ్లు ధాటిగా ఆడి మరో రెండు బంతులు ఉండగానే మ్యాచ్ ముగించారు. కీలక ఇన్నింగ్స్తో ఢిల్లీని గెలిపించిన జొనాసెన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంది. ఆర్సీబీ బౌలర్లలో ఆశా శోభన, ప్రీతీ బోస్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
ఆఖరి ఓవర్లో ఢిల్లీ విజయానికి 9 రన్స్ కొట్టాలి. రేణుకా ఠాకూర్ వేసిన 20వ ఓవర్ తొలి రెండు బంతులకు సింగిల్స్ మాత్రమే వచ్చాయి. దాంతో, అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఆర్సీబీ గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ, జొనాసెన్ అద్భుతం చేసింది. మూడో బంతికి సిక్స్ బాదింది. దాంతో స్కోర్ సమం అయింది. అంతే.. ఈ మ్యాచ్లో గెలిచి బోణీ కొట్టాలనుకున్న ఆర్సీబీ ఆశలు గల్లంతయ్యాయి. నాలుగో బంతికి జొనాసెన్ ఫోర్ కొట్టడంతో ఢిల్లీ విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళురు (Royal Challengers Bangalore) 150 రన్స్ చేసింది. ఎలీసా పెర్రీ (67) హఫ్ సెంచరీతో ఆర్సీబీని ఆదుకుంది. ఆమెకు రీచా ఘోష్ (37) సహకారం అందించింది. వీళ్లిద్దరూ ఫోర్లు, సిక్స్లతో ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. నాలుగో వికెట్కు 74 రన్స్ జోడించారు. 137 పరుగుల వద్ద రీచా నాలుగో వికెట్గా వెనుదిరగడంతో స్కోర్బోర్డు వేగం మందగించింది. పెర్రీ, రీచా ధాటికి ఆఖరి ఆరు ఓవర్లలో 82 పరుగులు వచ్చాయి. ఢిల్లీ బౌలర్లలో శిఖా పాండే మూడు, తారా నోరిస్ ఒక వికెట్ తీశారు.