Ind vs Pak | టీ20 వరల్డ్ కప్లో క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్కు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది . చిరకాల ప్రత్యర్థులైన ఈ రెండు జట్ల మధ్య జరగాల్సిన హై వోల్టేజ్ పోరు గత కొన్ని రోజులుగా అనిశ్చితిలో నిలిచినా, ఇప్పుడు పరిస్థితులు సానుకూలంగా మారాయి. దాదాపు ఎనిమిది రోజులుగా కొనసాగిన పాకిస్థాన్ డ్రామాకు ముగింపు పలికే దిశగా పరిణామాలు సాగుతున్నాయి. షెడ్యూల్ ప్రకారమే ఈ నెల 15న శ్రీలంకలోని కొలంబో వేదికగా మ్యాచ్ నిర్వహణకు మార్గం సుగమమం అయింది. సోమవారం రాత్రి ఈ మేరకు పాక్ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. స్నేహపూర్వక దేశాల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, బహుళపక్ష చర్చల్లో సాధించిన ఫలితాల దృష్ట్యా తాము ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది.
అంతేకాదు క్రికెట్ స్ఫూర్తిని కాపాడటంతో పాటు, ఈ గ్లోబల్ క్రీడ కొనసాగింపునకు మద్దతు ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలియజేసింది. శ్రీలంక వేదికగా భారత్తో జరగాల్సిన మ్యాచ్ను పాకిస్థాన్ బహిష్కరిస్తున్నట్లు ముందుగా సంకేతాలు ఇవ్వడంతో టోర్నమెంట్పై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) రంగంలోకి దిగింది. ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజా స్వయంగా పాకిస్థాన్కు వెళ్లి లాహోర్లో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీతో సమావేశమయ్యారు. మ్యాచ్ ఆడకపోతే ఎదురయ్యే ఆర్థిక, ప్రతిష్టాపరమైన పరిణామాలను పాక్ బోర్డుకు వివరించినట్లు సమాచారం. అయితే బంగ్లాదేశ్ను టోర్నమెంట్ నుంచి తప్పించిన నేపథ్యంలో వారికి మద్దతుగా నిలవాలనే ఉద్దేశంతో భారత్తో మ్యాచ్ను బహిష్కరించాలనే వైఖరిని పాక్ ముందుగా ప్రదర్శించింది. ఈ పరిణామాల మధ్య ఐసీసీ–పీసీబీ సమావేశాలు కీలక మలుపు తిప్పాయి. ఈ చర్చల్లో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ అమీనుల్ ఇస్లాం కూడా పాల్గొనడం విశేషం.
మరోవైపు బంగ్లాదేశ్ బోర్డు చైర్మన్ అమీనుల్ ఇస్లాం చేసిన వ్యాఖ్యలు కూడా ఈ వ్యవహారానికి కొత్త దిశను చూపించాయి. పాకిస్థాన్ నిజమైన క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించిందని ఆయన ప్రశంసలు కురిపించారు. తమకు మద్దతుగా నిలిచిన పీసీబీకి కృతజ్ఞతలు తెలుపుతూ, క్రికెట్ మేలుకోసం భారత్తో మ్యాచ్ ఆడాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. ఈ ప్రకటనలు పాక్ వైఖరిలో మార్పుకు కారణమయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు.మొత్తం మీద, రాజకీయ ఉద్రిక్తతల నీడలో సాగిన ఈ వివాదానికి తెరపడింది.. క్రికెట్ ప్రేమికులకు ఇది నిజంగా థ్రిల్లింగ్ న్యూస్గా మారింది.