Gautam Gambhir : ఆసియా కప్(Asia Cup 2023) ట్రోఫీ నెగ్గిన భారత జట్టు రెట్టించిన ఉత్సాహంతో వరల్డ్ కప్(ODI World Cup 2023) పోటీలకు సిద్ధమవుతోంది. సొంత గడ్డపై మరోసారి ప్రపంచ కప్ను ముద్దాడాలని రోహిత్ శర్మ(Rohit Sharma) బృందం ఉవ్విళ్లూరుతోంది. టాపార్డర్, బౌలింగ్ యూనిట్ సూపర్ ఫామ్లో ఉండడంతో టైటిల్ వేటను ఘనంగా ప్రారంభించాలనే కసితో ఉంది. అయితే.. ఏమాత్రం ఒత్తిడికి లోనైనా వెనకబడే అవకాశం ఉంది. ప్రపంచ కప్ పోటీలకు కౌంట్ డౌన్ మొదలైన ఈ సమయంలో మాజీ ఆటగాడు గౌతం గంభీర్(Gautam Gambhir) హిట్మ్యాన్ను హెచ్చరించాడు.
ఈ మెగా టోర్నీలో రాణించకుంటే రోహిత్ విమర్శల పాలవుడతని గౌతీ అన్నాడు. ‘కెప్టెన్గా రోహిత్ సామర్థ్యంపై ఎలాంటి అనుమానం లేదు. అతడు ఐదు ఐపీఎల్ టైటిళ్లు గెలిచాడు. కొందరైతే ఒక్కటి కూడా అందుకోలేకపోయారు. కానీ, మరో 15 రోజుల్లో సొంతగడ్డపై రోహిత్కు అసలైన పరీక్ష ఎదురవ్వనుంది. వరల్డ్ కప్లో భారత ఆటగాళ్లు రాణించకుంటే విమర్శలు వస్తాయి. కెప్టెన్ విఫలం అయితే అతడిపై ప్రశ్నల వర్షం కురుస్తుంది. గతంలో విరాట్ కోహ్లీ(Virat Kohli), 2007లో రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే.. ప్రస్తుత జట్టు వరల్డ్ కప్ ఫైనల్ చేరగల సత్తా ఉంది’ అని గంభీర్ వెల్లడించాడు.
ఎనిమిదోసారి ఆసియా కప్ ట్రోఫీ గెలిచిన టీమిండియా
వరల్డ్ కప్ ముందు భారత జట్టు ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. 24న మొహాలీలో తొలి వన్డే జరుగనుంది. సెప్టెంబర్ 28 (ఇండోర్)న రెండో వన్డే, అక్టోబర్ (1) రాజ్కోట్లో మూడో వన్డేలో ఇండియా, ఆసీస్ తలపడనున్నాయి. అయితే.. తొలి రెండు వన్డేలకు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardhik Pandya), స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ(Virat Kohli), కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav)లకు సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. అక్టోబర్ 5న ప్రపంచ కప్ సమరం షురూ కానుంది. ఆరంభ పోరులో ఇంగ్లండ్, న్యూజిలాండ్ ఎదురుపడనున్నాయి. భారత జట్టు అక్టోబర్ 8న ఆస్ట్రేలియాను, అక్టోబర్ 14న దాయాది పాకిస్థాన్ను ఢీకొట్టనుంది.