Virat Kohli : భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli) మరో మైలురాయికి చేరువయ్యాడు. టెస్టుల్లో మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virendra Sehwag) రికార్డును కోహ్లీ బద్ధలు కొట్టాడు. దాంతో, ఈ ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఐదో ఇండియన్ క్రికెటర్గా విరాట్ రికార్డుల్లోకి ఎక్కాడు. వెస్టిండీస్ (Westindies)తో జరుగుతున్న తొలి టెస్టులో 36 పరగులతో నాటౌట్గా నిలిచిన కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు. కోహ్లీ 8,515 రన్స్తో సెహ్వాగ్ను ఆరో స్థానానికి నెట్టేశాడు. 103 టెస్టులు ఆడిన వీరూ 8,503 పరుగులు సాధించాడు.
భారత్ తరఫున టెస్టుల్లో ఎక్కువ రన్స్ కొట్టింది ఎవరంటే..? సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar). మాస్టర్ బ్లాస్టర్ 15, 921 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రాహుల్ ద్రవిడ్(13,265 పరుగులు), సునీల్ గావస్కర్(10,122 పరుగులు), వీవీఎస్ లక్ష్మణ్(8,781 పరుగులు) వరుసగా రెండు, మూడు, నాలుగో స్థానాల్లో నిలిచారు. మరో 266 పరుగులు సాధిస్తే కోహ్లీ, లక్ష్మణ్ రికార్డును సమం చేస్తాడు.
గావస్కర్, సచిన్, సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్
వెస్టిండీస్తో జరుగుతున్న డొమినికా టెస్టు(Dominica Test)లో విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. స్వల్ప వ్యవధిలో శుభ్మన్ గిల్(6), సెంచరీ హీరో రోహిత్ శర్మ(103) వికెట్లు పడడంతో అతను క్రీజులో ఎక్కువ సేపు నిలిచేందుకే ప్రాధాన్యం ఇచ్చాడు. విండీస్ బౌలర్లను పరీక్షిస్తూ క్రీజులో పాతుకుపోయాడు. ఆట ముగిసే సరికి 36 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఆరంగేట్రం మ్యాచ్లోనే సెంచరీతో కదం తొక్కిన యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(143 నాటౌట్ : 350 బంతుల్లో 14 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు.
రోహిత్ శర్మ(103), యశస్వీ జైస్వాల్(143 నాటౌట్)
దాంతో, రెండో రోజు టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. ప్రస్తుతం భారత జట్టు 162 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడో రోజు కోహ్లీ, యశస్వీ భారీ భాగస్వామ్యం నెలకొల్పితే విండీస్ ఇక కష్ట కాలమే. తొలి ఇన్నింగ్స్లో వెస్టిండీస్ 150కే కుప్పకూలిన విషయం తెలిసిందే.