KL Rahul | రాజ్కోట్: ఇంగ్లండ్తో జరగనున్న మూడో టెస్టుకు సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. గాయం నుంచి రాహుల్ ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో అతడిని తప్పిస్తున్నట్లు బీసీసీఐ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. అతడి స్థానంలో కర్ణాటకకే చెందిన లెఫ్ట్హ్యాండ్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ను జట్టుకు ఎంపిక చేసింది.
హైదరాబాద్లో జరిగిన తొలి టెస్టు అనంతరం వైజాగ్ మ్యాచ్కు దూరమైన రాహుల్ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో పునరావాసం పొందాడు. దీంతో మిగిలిన మూడు టెస్టుల కోసం సెలెక్షన్ కమిటీ రాహుల్ను ఎంపిక చేసింది. అయితే మ్యాచ్ ఆరంభానికి మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండగా.. రాహుల్ 90 శాతం మాత్రమే కోలుకోవడంతో అతడిని తప్పించారు. ‘రాజ్కోట్ టెస్టుకు రాహుల్ దూరమయ్యాడు.
ప్రస్తుతం 90 శాతం కోలుకున్న అతడిని బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షిస్తున్నది’ అని బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. సీనియర్లు పుజారా, రహానే జట్టుకు దూరం కాగా.. కోహ్లీ ఈ సిరీస్కు అందుబాటులో లేకుండా పోయాడు. శ్రేయస్ అయ్యర్ కూడా మిగిలిన మూడు మ్యాచ్లకు ఎంపిక కాలేదు. ఇప్పుడు రాహుల్ కూడా లేకపోవడంతో.. మిడిలార్డర్లో అనుభవరాహిత్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. మరోవైపు వికెట్ కీపర్ బ్యాటర్, తెలుగు ఆటగాడు శ్రీకర్ భరత్ స్థానంలో మూడు టెస్టులో ధ్రువ్ జురెల్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సర్ఫారాజ్ ఖాన్ రాజ్కోట్లో అరంగేట్రం చేయడం లాంఛనమే!