సిటీబ్యూరో, డిసెంబర్ 13: హైదరాబాద్ సైక్లిస్ట్సు గ్రూప్(హెచ్సీజీ) అరుదైన ఘనత సొంతం చేసుకుంది. దేశంలోనే మొదటి సారిగా ‘కశ్మీర్ టు కన్యాకుమారి’ సైక్లింగ్ యాత్రను ముచ్చటగా మూడోసారి పూర్తి చేసింది. ఈ క్రమంలో సరిహద్దుల్లో ఆర్మీ అధికారుల ప్రశంసలు పొందారు. సైక్లింగ్ వినియోగం ప్రోత్సహించాలనే లక్ష్యంతో నగరానికి చెందిన 13 మంది హెచ్సీజీ సైక్లిస్టులు 23 రోజుల్లో లడఖ్ నుంచి 13 రాష్ర్టాల మీదుగా వయా హైదరాబాద్ గుండా కన్యాకుమారి చేరుకుని యాత్రను ముగించారు.
వీరంతా బుధవారం నగరానికి చేరుకున్నారు. మొత్తం 3,900 కిలో మీటర్ల మేర సైక్లింగ్ రైడ్ చేసి ఔరా అనిపించారు. హెచ్సీజీ ఫౌండర్ రవీందర్ నందనూరి ఆధ్వర్యంలో రేఖ సోలంకి, రవీందర్రెడ్డి, ప్రదీప్ కుమార్, సురేశ్బాబు, ప్రవీణ్ కుమార్, భవేష్ కుమార్, మోహిత్ కుమార్, నాగరాజు, సంతోష్, కవిష్, వెన్నెల, రాహుల్, సోమశేఖర్ ఈ సాహస సైక్లింగ్ యాత్రలో పాల్గొని విజయవంతం చేశారు. నవంబర్ 21న వీరి యాత్ర లడఖ్ నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి 2500 కిలోమీటర్లు రైడ్ చేసి డిసెంబర్ 7న హైదరాబాద్కు చేరుకున్నారు. వీరికి నగరంలో అపూర్వ స్వాగతం లభించింది. తిరిగి నగరం నుంచి కన్యాకుమారి వైపుగా సైక్లింగ్ యాత్ర సాగింది. సైక్లింగ్ ప్రారంభం నుంచి ఆఖరి వరకు రోడ్డు మార్గాల గుండా ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించిందని సైక్లిస్టులు తెలిపారు.