ఇంగ్లండ్ టెస్టు జట్టు మాజీ సారథి జో రూట్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. మరీ ముఖ్యంగా గడిచిన ఏడాదిన్నరగా టెస్టులలో అతడి ప్రదర్శన నభూతో నభవిష్యత్ అన్నవిధంగా సాగుతోంది. గత 24 టెస్టులలో ఈ పరుగుల యంత్రం ఏకంగా 11 సెంచరీలు చేశాడంటే అతడి జోరు ఏ స్థాయిలో కొనసాగుతున్నదో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఇండియాతో ముగిసిన రీషెడ్యూల్డ్ టెస్టు రెండో ఇన్నింగ్స్ (142 నాటౌట్) సెంచరీ చేయడం ద్వారా అతడు విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్ లను అధిగమించాడు.
2019 నవంబర్ లో కోహ్లి టెస్టులలో 27వ సెంచరీ చేశాడు. అప్పట్నుంచి అతడి బ్యాట్ నుంచి మూడంకెల స్కోరు లేదు. సరిగ్గా అదే సమయానికి టెస్టులలో రూట్ చేసినవి 16 శతకాలు. రెండున్నరేండ్లలో రూట్ ఏకంగా 11 సెంచరీలతో చెలరేగడం గమనార్హం. ఇందులో రెండు డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి.
ఇండియాతో చేసిన సెంచరీతో రూట్.. స్మిత్ (27) ను కూడా అధిగమించాడు. తద్వారా ఆధునిక క్రికెట్ లో ఫ్యాబ్-4 బ్యాటర్లు గా పిలవబడుతున్న విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్ లలో అగ్రస్థానానికి చేరాడు. ఈ నలుగురిలో టెస్టులలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కూడా జో రూటే కావడం విశేషం. అతడు ఇటీవలే టెస్టులలో పది వేల పరుగుల మార్కును అందుకున్నాడు. ఫ్యాబ్-4లో మిగతా ముగ్గురు ఇంకా ఆ మార్కును చేరలేదు.
ఇక ఐదో టెస్టులో సెంచరీ చేయడం ద్వారా రూట్ మరో ఘనతను కూడా అందుకున్నాడు. ఇండియాపై టెస్టులలో అత్యధిక శతకాలు (9) చేసిన బ్యాటర్ గా అరుదైన ఘనతను అందుకున్నాడు. గతంలో ఈ రికార్డు రికీ పాంటింగ్, వీవ్ రిచర్డ్స్, గ్యారీ సోబర్స్, స్టీవ్ స్మిత్ (8 సెంచరీలు) ల పేరిట ఉండేది. తన కెరీర్ లోనే పీక్స్ లో ఉన్న రూట్ కు 2022 లో ఇది ఐదో శతకం కావడం విశేషం.
⏪ November 2019: Virat Kohli had 27 Test hundreds and Joe Root had 16.
📆 July 2022: Virat Kohli has 27 Test hundreds and Joe Root has 28.#ENGvIND pic.twitter.com/XUExnre5sp
— talkSPORT (@talkSPORT) July 5, 2022