వచ్చే నెలలో టీ20 ప్రపంచకప్ ప్రారంభం అవడానికి ముందే భారత జట్టుకు షాక్ తగిలింది. మోకాలి గాయంతో స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఇప్పటికే జట్టుకు దూరమవగా.. ఇప్పుడు పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా కూడా ప్రపంచకప్నకు దూరమయ్యాడు. వెన్నునొప్పితో ఇబ్బంది పడిన బుమ్రా.. జట్టుకు దూరమైనట్లు తెలుస్తోంది.
ఈ విషయంలో జట్టు మేనేజ్మెంట్ తీరును భారత లెజెండరీ బ్యాటర్ వసీం జాఫర్ తప్పుబట్టాడు. ఇంగ్లండ్తో సిరీస్ తర్వాత జట్టుకు దూరంగా ఉన్న బుమ్రా.. వెన్నుగాయం నుంచి కోలుకుంటున్నాడు. అన్నీ సక్రమంగా జరిగితే టీ20 ప్రపంచకప్ నాటికి బుమ్రా కోలుకుంటాడని అనుకున్నారు. అయితే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్లో అతన్ని ఆడించారు. దీంతో అతని గాయం తిరగబెట్టింది.
టీం మేనేజ్మెంట్ తొందరపడి బుమ్రాను ఆసీస్ సిరీస్లో ఆడించిందని వసీం జాఫర్ అన్నాడు. ‘బుమ్రా గాయం ఎంత తీవ్రమైనదో మనకు తెలీదు. కానీ ఇంకొంచెం టైం తీసుకొని ఉంటే ప్రపంచకప్ నాటికి సిద్దంగా ఉండేవాడేమో? ఆసీస్తో ఆడటంతో అతని గాయం మరింత ఒత్తిడికి గురై తిరగబెట్టి ఉండొచ్చు’ అని చెప్పాడు. బుమ్రా విలక్షణమైన బౌలింగ్ యాక్షన్ కారణంగా అతని వెన్నుపై తీవ్రమైన ఒత్తిడి పడుతుందని, ఇది అతని కెరీర్కు బ్రేకులు వేస్తుందని పలువురు దిగ్గజాలు గతంలోనే హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే.