Ravindra Jadeja : ప్రతిష్ఠాత్మకమైన ఆసియా కప్(Asia cup 2023) మరో రెండు వారాల్లో మొదల్వవనుంది. అయితే.. ఈ మెగా టోర్నలో భారత్(India), పాకిస్థాన్(Pakistan) మ్యాచ్పైనే అందరి ఫోకస్ ఉందనే విషయం తెలిసిందే. దాయాదుల హై వోల్టేజ్ మ్యాచ్లో విజయం కోసం ఇరుజట్ల ఆటగాళ్లు శాయశక్తులా పోరాడతారు. తాజాగా భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) కూడా చిరకాల ప్రత్యర్థి పాక్తో మ్యాచ్పై స్పందించాడు. పాకిస్థాన్తో మ్యాచ్ అంటే.. జట్టంతా సర్వ శక్తులు ఒడ్డుతుందని, ప్రతి ఒక్కరూ తమ అత్యుత్తమ ప్రదర్శన చేస్తారని జడ్డూ అన్నాడు.
‘ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్పై ఎన్నో అంచనాలు ఉంటాయి. అయితే.. మేము మాత్రం ప్రతి గేమ్కు ఒకే ప్రాధాన్యం ఇస్తాం. కాకపోతే దాయాదితో పోరు అంటే మరింత దూకుడుగా ఆడుతాం. మా శక్తినంతా కూడదీసుకుని పోరాడుతాం’ అని జడ్డూ తెలిపాడు. అంతేకాదు గత ఏడాది యూఏఈలో జరిగిన ఆసియా కప్లో పాక్ చేతిలో ఓటమిపై కూడా ఈ స్టార్ ఆల్రౌండర్ మాట్లాడాడు.
‘మేము గెలవాలనే కసితోనే ఆడుతాం. అయితే.. కొన్నిసార్లు ఫలితం వేరేలా రావొచ్చు. ఇరుజట్ల ఆటగాళ్లు మ్యాచ్ గెలిచేందుకు వంద శాతం కష్టపడతారు. కానీ, కొన్నిసార్లు అనుకున్న రిజల్ట్ రాకుంటే మనం ఏం చేయలేం’ అని జడేజా వెల్లడించాడు. నిరుడు ఆసియా కప్లో భారత్, పాక్ రెండు సార్లు తలపడగా.. చెరొక మ్యాచ్లో గెలిచాయి. దాంతో, ఈసారి ఎవరు పై చేయి సాధిస్తారు? అనేది అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది.
టీ20 వరల్డ్ కప్లో పాక్ను చిత్తు చేసిన భారత్
ఈ ఏడాది ఆసియా కప్ ఆగస్టు 30న షురూ కానుంది. హైబ్రిడ్ మోడల్లో జరగనున్న ఈ టోర్నీకి శ్రీలంక, పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్నాయి. భారత్, పాక్ జట్లు సెప్టెంబర్ 2న లంక గడ్డపై ఢీ కొననున్నాయి. నిరుడు టీ20 వరల్డ్ కప్ తర్వాత మళ్లీ ఇరుజట్లు తలపడడం ఇదే మొదటిసారి. దాంతో, ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది. వన్డే ఫార్మాట్లో జరుగనున్న ఈ టోర్నీ టీమిండియా సహా పాక్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లకు వన్డే వరల్డ్ కప్ సన్నద్ధతకు ఎంతో ఉపయోగపడనుంది. 2011 తర్వాత మళ్లీ భారత్ వన్డే ప్రపంచ కప్ పోటీలకు ఆతిథ్యం ఇస్తోంది. అక్టోబర్ 5న జరిగే ఆరంభ పోరులో ఇంగ్లండ్, న్యూజిలాండ్ ఎదురుపడనున్నాయి.