Ravindra Jadeja : వైజాగ్ టెస్టులో ఇంగ్లండ్ను చిత్తుగా ఓడించిన భారత జట్టు సిరీస్ సమం చేసింది. స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja), మహ్మద్ షమీలు లేకుండానే అద్భుత విజయంతో ఆశ్చర్యపరిచింది. సిరీస్లో కీలకమైన రాజ్కోట్ టెస్టుకు ఇంకా 8 రోజుల సమయం ఉంది. దాంతో, ఆలోపు మిగిలిన మూడు టెస్టులకు బీసీసీఐ తుది స్క్వాడ్ను ప్రకటించనుంది.
ఈ నేపథ్యంలో రెండో టెస్టుకు దూరమైన జడేజా తన గాయంపై అప్డేట్ ఇచ్చాడు. తొడ కండరాల గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నానని సోషల్మీడియలో పోస్ట్ పెట్టాడు. దానికి ‘నా ఆరోగ్యం మెరుగుపడుతోంది’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు.
దాంతో, మూడో టెస్టుకు జడ్డూ అందుబాటులో ఉండే అవకాశముందని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జడేజా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA)లో ఉన్నాడు. అక్కడి వైద్య బృందం అతడి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.
ఉప్పల్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో జడేజా గాపడ్డాడు. తొలి ఇన్నింగ్స్లో 86 పరుగులతో జట్టుకు భారీ స్కోర్ అందించిన అతడు ఆ తర్వాత బంతితోనూ చెలరేగి మూడు కీలక వికెట్లు తీశాడు. అయితే.. రెండో ఇన్నింగ్స్లో కష్టాల్లో పడిన జట్టును ఆదుకుంటాడనుకున్న జడ్డూ 2 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. ఆ కొద్ది సేపటికే భారత్ 28 పరుగుల తేడాతో మ్యాచ్ చేజార్చుకుంది. అయితే.. వైజాగ్ టెస్టులో పుంజుకున్న భారత్.. 106 పరుగుల తేడాతో గెలుపొంది సిరీస్ సమం చేసింది.