Ishan Kishan : భారత క్రికెట్లో ఈమధ్య ఇషాన్ కిషన్(Ishan Kishan) పేరు తెగ వినిపించింది. బీసీసీఐ నెత్తినోరు మొత్తుకున్నా సరే.. ఈ యంగ్స్టర్ రంజీల్లో ఆడేందుకు ససేమిరా అనడమే అందుకు కారణం. దాంతో, అతడిపై భారత క్రికెట్ బోర్డు(BCCI) వేటు చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దుకు ముందు ఇషాన్తో బీసీసీఐ, హెడ్కోచ్ మాట్లాడి ఉండాల్సిందని పలువురు అభిప్రాయ పడ్డారు.
అయితే.. ఇంగ్లండ్ సిరీస్ మధ్యలోనే ఈ లెఫ్ట్ హ్యాండర్ను బీసీసీఐ సంప్రతించిందట. వైజాగ్ టెస్టు తర్వాత జట్టులో కలవాలని ఇషాన్ను బీసీసీఐ అడిగిందట. కానీ, ఇషాన్ మాత్రం నో చెప్పాడట. తాను ఇంకా సిద్ధంగా లేనని చెప్పాడని ఈఎప్పీఎన్ క్రిక్ఇన్ఫో తెలిపింది. వన్డే వరల్డ్ కప్ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికైన ఇషాన్.. అనూహ్యంగా సిరీస్ మధ్యలోనే స్వదేశం వచ్చేశాడు.
జితేశ్ శర్మ, ఇషాన్ కిషన్
టీ20లకు జితేశ్ శర్మను ఎంపిక చేయడంతో అగ్రహించిన ఇషాన్.. చెప్పా పెట్టకుండా భారత విమానం ఎక్కేశాడు. అనంతరం ఇంగ్లండ్ సిరీస్కు ప్రకటించిన స్క్వాడ్లో ఇషాన్ పేరు లేదు. దాంతో, అతడికి ఏమైంది? అని అందరూ ఆందోళనకు గురయ్యారు. కానీ, ఇషాన్ మాత్రం మానసిక ఆరోగ్యం కోసం యోగా సాధన చేస్తున్న వీడియోతో అందర్నీ కూల్ చేశాడు.
అయితే.. బీసీసీఐ పదే పదే చెప్పినా అతడు రంజీల్లో ఆడలేదు. దాంతో, సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బీసీసీఐ అతడి పేరు తీసేసింది. ఇగోకు పోయి కాంట్రాక్ట్ కోల్పోయాడంటూ.. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో ఇషాన్ దేశవాళీలో ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఇషాన్ వారం క్రితం.. డీవై పాటిల్ స్టేడియంలో జరిగే టీ20 టోర్నమెంట్లో ఆడనున్నాడు. బరోడా స్టేడియంలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలతో కలిసి ప్రాక్టీస్ చేశాడు. మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే అకాడమీలో వికెట్ కీపింగ్ సాధన చేశాడు.
శ్రేయస్ అయ్యర్
మరోవైపు శ్రేయస్ అయ్యర్ ఫిట్గానే ఉన్నా గాయం సాకుతో రంజీ క్రికెట్ తప్పించుకోవాలని చూశాడు. కానీ, బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ అతడు ఫిట్గానే ఉన్నాడని సర్టిఫై చేసింది. దాంతో, చిర్రెత్తుకొచ్చిన బీసీసీఐ అయ్యర్ను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించింది. ఆ దెబ్బతో దారిలోకి వచ్చిన అతడు రంజీ సెమీఫైనల్లో ఆడేందుకు సిద్దమవుతున్నాడు. అతడు ముంబై తరఫున బరిలోకి దిగనున్నాడు.