Google Play Store | సర్వీస్ ఫీజు చెల్లించని కొన్ని యాప్స్ను గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి తొలగించడం సరి కాదని కేంద్ర ఐటీ, టెలికం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. టెక్నాలజీ, స్టార్టప్ కంపెనీల యాప్స్ను గూగుల్ ప్లే స్టోర్ తొలగించింది. దీనిపై ఇరుపక్షాలతో వచ్చేవారం సమావేశమవుతామని అశ్వినీ వైష్ణవ్.. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దేశీయ ఆర్థిక వ్యవస్థకు స్టార్టప్ ఎకో సిస్టమ్ గుండె వంటిదని, అటువంటి సంస్థల తల రాతలను ప్రధాన టెక్నాలజీ కంపెనీలు నిర్ణయించరాదన్నారు. ఈ అంశాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు.
స్టార్టప్, టెక్ కంపెనీల యాప్స్ తొలగించడాన్ని తాము ఎంత మాత్రమూ అంగీకరించే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. స్టార్టప్ సంస్థలకు రక్షణ కల్పించడం ముఖ్యం అన్నారు. ఈ అంశంపై గూగుల్, యాప్ డెవలపర్లతో వచ్చే వారం సమావేశం అవుతామని తెలిపారు. దేశంలో లక్ష స్టార్టప్ సంస్థలు రూపుదిద్దుకోగా, 100 యూనికార్న్లు అవతరించాయన్నారు.
గూగుల్ ప్లే స్టోర్లో లిస్టింగ్ చేసే యాప్స్ యాజమాన్యాల నుంచి 15-30 శాతం చార్జీల వ్యవస్థను తొలగించాలన్న సీసీఐ ఆదేశాలతో గూగుల్ 11-26 శాతం ఫీజు వసూలు చేస్తున్నది. ఈ నిర్ణయాన్ని మాట్రిమోనీ డాట్ కామ్, షాదీ డాట్ కామ్, ఇన్ఫో ఎడ్జ్, అనాకడమీ, ఆహా, డిస్నీ+ హాట్ స్టార్, ట్రూలీ మ్యాడ్లీ, క్వాక్ క్వాక్, స్టేజ్, కుటుంబ్, టెస్ట్ బుక్ వంటి కంపెనీలు సవాల్ చేస్తున్నాయి. కానీ ఆ పది కంపెనీలు ఫీజులు చెల్లించడం లేదని గూగుల్ పేర్కొంది. దీనిపై జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించిందని కూడా గుర్తు చేసింది. దీంతో కొన్ని యాప్స్ తన ప్లే స్టోర్ నుంచి తొలగించింది. కేంద్ర ప్రభుత్వ జోక్యంతో కొన్ని యాప్స్ ను గూగుల్ పునరుద్ధరించింది.