Ishan Kishan : భారత జట్టు చిచ్చరపిడుగు ఇషాన్ కిషన్(Ishan Kishan) తొలి టీ20లో వీరవిహారం చేశాడు. వైజాగ్లో ఆస్ట్రేలియా(Australia) బౌలర్లను ఉతికారేస్తూ హాఫ్ సెంచరీతో రాణించాడు. 208 పరుగుల ఛేదనలో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్.. కేవలం 39 బంతుల్లోనే 5 సిక్సర్లతో 58 రన్స్ చేశాడు. దాంతో గతంలో రిషభ్ పంత్ (Rishabh Pant) పేరిట ఉన్న సిక్సర్ల రికార్డు బద్ధలు కొట్టాడు. 2019లో పంత్ వెస్టిండీస్పై 42 బంతుల్లోనే 4 సిక్సర్లతో 65 పరుగులు చేశాడు. వైజాగ్లో ఇషాన్ 5 సిక్సర్లు కొట్టి.. పొట్టి ఫార్మాట్ ఒకే మ్యాచ్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత వికెట్ కీపర్గా గుర్తింపు సాధించాడు.
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) తరఫున దంచికొట్టిన ఇషాన్.. రెండేండ్ల క్రితం టీ20ల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకూ 30 టీ20 మ్యాచుల్లో ఈ లెఫ్ట్ హ్యాండర్ 25.65 సగటుతో 744 రన్స్ కొట్టాడు. అందులో ఐదు హాఫ్ సెంచరీలున్నాయి. బంగ్లాదేశ్పై వన్డేల్లో డబుల్ సెంచరీతో పాపులర్ అయిన ఇషాన్.. జట్టులో చోటు ఖాయం చేసుకున్నాడు.
రిషభ్ పంత్, ఇషాన్ కిషన్
వెస్టిండీస్ సిరీస్లో, ఆసియా కప్లో నిలకడగా రాణించి వన్డే వరల్డ్ కప్ 15మంది బృందంలో చోటు దక్కించుకున్నాడు. అయితే.. మెగా టోర్నీలో ఇషాన్కు చాన్స్ దొరకలే. అయినా టోర్నీ ఆసాంతం గంటలకొద్దీ నెట్స్లో ప్రాక్టీస్ చేశానని, కోచ్లతో తన బ్యాటింగ్ ఇంప్రూవ్మెంట్ గురించి చర్చించానని వైజాగ్లో తొలి టీ20 విజయం అనంతరం ఇషాన్ తెలిపాడు. విశాఖలో గురువారం రాత్రి జరిగిన తొలి టీ20లో భారత్.. ఆస్ట్రేలియాపై అద్భుత విజయం సాధించింది. సూర్యకుమార్ యాదవ్ (80 : 42 బంతుల్లో ఫోర్లు, సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. డాషింగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్(58: 39 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు)తో జట్టును గెలుపు వాకిట నిలిపారు. ఆ తర్వాత రింకూ సింగ్(28 నాటౌట్), టెయిలెండర్లతో కలిసి లాంచనం పూర్తి చేశాడు. దాంతో, భారత్ పొట్టి ఫార్మాట్లో రికార్డు లక్ష్యాన్ని (209 పరుగులు) ఛేదించింది. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్లో భారత్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.