INDvsSA 1st ODI: ఆడింది తక్కువ మ్యాచ్లే అయినా టీ20లలో భారత జట్టుకు నయా ఫినిషర్గా మారిన రింకూ సింగ్.. ఆదివారం నుంచి దక్షిణాఫ్రికాతో వాండరర్స్ వేదికగా జరుగనున్న తొలి వన్డేలో ఆడనున్నాడా..? వన్డేలలో రింకూ ఎంట్రీ ఖాయమైనట్టేనా..? ఈ ప్రశ్నలకు వన్డేలలో టీమిండియా తాత్కాలిక సారథి కెఎల్ రాహుల్ క్లారిటీ ఇచ్చాడు. వన్డే సిరీస్ ఆరంభానికి ముందు అతడు వాండరర్స్లో నిర్వహించిన ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో రింకూ ఎంట్రీపై తేల్చేశాడు. ఈ ఉత్తరప్రదేశ్ యువ సంచలనం రేపటి మ్యాచ్లో ఆడే అవకాశం ఉందని రాహుల్ తెలిపాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా టీ20 సిరీస్తో పాటు వన్డేలకూ ఎంపికైన విషయం తెలిసిందే.
రింకూ ఎంట్రీపై అడిగిన ప్రశ్నకు రాహుల్ సమాధానం చెబుతూ.. ‘అవును. కచ్చితంగా అతడు వన్డే సిరీస్లో అవకాశం దక్కించుకుంటాడు..’ అని తెలిపాడు. అంతేగాక..‘ ఐపీఎల్ నుంచి మనం అతడి స్కిల్స్ను చూస్తున్నాం. ఆట పట్ల అతడికున్న అవగాహన, ఒత్తిడిలో కూడా కూల్గా ఉంటూ మ్యాచ్ను ఫినిష్ చేసే తత్వం ఉన్న క్రికెటర్ అతడు..’ అని బదులిచ్చాడు. కెప్టెన్ క్లారిటీ ఇవ్వడంతో ఇక వన్డేలలో అతడి అధికారిక అరంగేట్రమే మిగిలిందని అభిమానులు చెప్పుకుంటున్నారు. టీ20లతో పోలిస్తే పూర్తి భిన్నమైన వన్డే ఫార్మాట్లో రింకూ ఏ మేరకు తన మార్కును చూపిస్తాడో చూడాలి.
KL Rahul confirms Rinku Singh will get the opportunity in the ODI series. pic.twitter.com/pw2nEmMGZr
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 16, 2023
రోహిత్, కోహ్లీ, అశ్విన్, గిల్ వంటి స్టార్ ప్లేయర్ల గైర్హాజరీతో ఈ సిరీస్లో కూడా యువ భారత జట్టు బరిలోకి దిగబోతోంది. తమిళనాడు ఆటగాడు, దేశవాళీ, ఐపీఎల్లో రాణిస్తున్న సాయి సుదర్శన్తో పాటు రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్లకు ఈ సిరీస్లో చోటుదక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.