INDvsAFG 3rd T20I: స్వదేశంలో అఫ్గానిస్తాన్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల సిరీస్లో ఇదివరకే రెండింటిని గెలిచిన భారత క్రికెట్ జట్టు సిరీస్ క్లీన్ స్వీప్పై కన్నేసింది. మొహాలీ, ఇండోర్ వేదికలుగా ముగిసిన తొలి రెండు మ్యాచ్లను నెగ్గిన భారత్.. నేడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా మూడో మ్యాచ్లో అఫ్గాన్లతో తలపడుతున్నది. ఈ మ్యాచ్లో భారత సారథి రోహిత్ శర్మ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అఫ్గాన్లు మొదట బౌలింగ్ చేయనున్నారు. ఇదివరకే సిరీస్ నెగ్గిన భారత్ తుది జట్టులో పలు మార్పులను చేసింది.
ఇండోర్ మాదిరిగానే బెంగళూరు కూడా బ్యాటింగ్ పిచ్ కావడంతో నేటి మ్యాచ్లోనూ అభిమానులకు పరుగుల పండుగే ఉండనుంది. తొలి రెండు మ్యాచ్లలో అవకాశాలు దక్కించుకోకపోయిన భారత ఆటగాళ్లు సంజూ శాంసన్, అవేశ్ ఖాన్ కుల్దీప్ యాదవ్లు ఈ మ్యాచ్లో ఆడుతున్నారు. అక్షర్ పటేల్, జితేశ్ శర్మ, అర్ష్దీప్ సింగ్ లకు టీమ్ మేనేజ్మెంట్ విశ్రాంతినిచ్చింది. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి ఐపీఎల్లో ఇది (చిన్నస్వామి స్టేడియం) హోంగ్రౌండ్గా ఉంది. దీంతో ఇక్కడ కోహ్లీ చెలరేగుతాడని ఆర్సీబీ ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ఏడాది జూన్లో వెస్టిండీస్ / అమెరికా వేదికగా జరగాల్సి ఉన్న టీ20 వరల్డ్ కప్కు ముందు మెన్ ఇన్ బ్లూ ఆడుతున్న ఆఖరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. మరోవైపు తొలి రెండు మ్యాచ్లలో ఓడిన అఫ్గాన్ ఈ మ్యాచ్లో అయినా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఆ జట్టులోనూ మూడు మార్పులు జరిగాయి.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శివమ్ దూబే, సంజూ శాంసన్, రింకూ సింగ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్
అఫ్గాన్: రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), గుల్బాదిన్ నయీబ్, అజ్మతుల్లా ఒమర్జయ్, మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, కరీమ్ జనత్, షరఫుద్దీన్ అష్రఫ్, ఖాయిస్ అహ్మద్, మహ్మద్ సలీమ్ సఫీ, ఫరీద్ అహ్మద్ మాలిక్