తొలి టీ20లో ఎదురైన పరాజయానికి టీమ్ఇండియా బదులు తీర్చుకుంది. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి మూడు మ్యాచ్ల సిరీస్ను సమం చేసింది. బౌలర్లు సమష్టిగా సత్తాచాటడంతో తొలుత కివీస్ రెండంకెల స్కోరుకే పరిమితం కాగా.. సునాయాస లక్ష్యాన్ని భారత్ చివరి ఓవర్లో ఛేదించింది. ఇక నిర్ణయాత్మక మూడో మ్యాచ్ బుధవారం అహ్మదాబాద్లో జరుగనుంది.
లక్నో: సొంతగడ్డపై వరుస సిరీస్ విజయాలతో దూకుడు మీదున్న భారత జట్టు.. ఆదివారం న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. లక్ష్యం పెద్దది కాకపోయినా.. భారత్కు విజయం అంత తేలిగ్గా మాత్రం వరించలేదు. బౌలర్లకు అనుకూలిస్తున్న పిచ్పై ఛేదన కష్టమని భావించి టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. కెప్టెన్ మిషెల్ శాంట్నర్ (19) టాప్ స్కోరర్ కాగా.. అలెన్ (11), కాన్వే (11), చాప్మన్ (14), బ్రాస్వెల్ (14) తలా కొన్ని పరుగులు చేశారు.
మన బౌలర్లలో అర్ష్దీప్ రెండు, పాండ్యా, సుందర్, చాహల్, హుడా, కుల్దీప్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో భారత్ 19.5 ఓవర్లలో 4 వికెట్లకు 101 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (26 నాటౌట్) టాప్ స్కోరర్ కాగా.. ఇషాన్ (19), హార్దిక్ పాండ్యా (15 నాటౌట్), త్రిపాఠి (13), గిల్ (11), సుందర్ (10) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. పొట్టి ఫార్మాట్లో దంచికొట్టే సూర్యఒక్కటంటే ఒక్క ఫోర్తో సరిపెట్టుకున్నాడంటే భారత ఇన్నింగ్స్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్: 20 ఓవర్లలో 99/8 (శాంట్నర్ 19; అర్ష్దీప్ 2/7, చాహల్ 1/4), భారత్: 19.5 ఓవర్లలో 101/4 (సూర్యకుమార్ 26 నాటౌట్, ఇషాన్ 19; బ్రాస్వెల్ 1/13).