విశాఖపట్నం: సొంతగడ్డపై భారత్ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నది. వరుసగా 12 విజయాలతో తమకు ఎదురే లేదన్నట్లుగా దూసుకెళ్లిన టీమ్ఇండియా జైత్రయాత్రకు దక్షిణాఫ్రికా బ్రేక్లు వేసింది. సీనియర్ల గైర్హాజరీలో అదరగొడుతారనుకున్న యువ క్రికెటర్లు అవకాశాలను అందిపుచ్చుకోవడంలో విఫలమవుతున్నారు. ఫలితంగా సఫారీలతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో 0-2తో భారత్ వెనుకంజలో ఉన్న పరిస్థితి. వరుసగా రెండు మ్యాచ్లను చేజార్చుకున్న భారత్..సిరీస్లో నిలువాలంటే తప్పక గెలువాల్సిన పరిస్థితి కొని తెచ్చుకుంది. మంగళవారం విశాఖపట్నం వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య కీలకమైన మూడో టీ20 మ్యాచ్ జరుగనుంది.
గత రెండు మ్యాచ్ల్లో సమిష్టి ప్రదర్శన కనబర్చడంలో విఫలమైన రిషబ్ పంత్ సారథ్యంలోని టీమ్ఇండియా ఎలాగైనా సిరీస్ దక్కించుకోవాలన్న పట్టుదలతో కనిపిస్తున్నది. మిగిలిన మూడు మ్యాచ్ల్లో కచ్చితంగా గెలిస్తేనే పంత్సేన పోటీలో నిలిచేది. బౌలింగ్ విషయానికొస్తే భువనేశ్వర్ పెద్ద దిక్కుగా కనిపిస్తున్నా..హర్షల్ పటేల్, అవేశ్ఖాన్, హార్దిక్ పాండ్యా ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. దక్షిణాఫ్రికా విషయానికొస్తే..అంచనాలకు మించి రాణిస్తున్నది. తొలి మ్యాచ్లో డేవిడ్ మిల్లర్, డస్సెన్ అదరగొడితే..క్లాసెన్ ఖతర్నాక్ ఆటతో రెండో మ్యాచ్ గెలిపించాడు. దూకుడు కనబరుస్తున్నా..సఫారీలు మరో రెండు మ్యాచ్లు ఉండగానే వైజాగ్లో సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తున్నారు.