వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా అజేయంగా కొనసాగుతున్నది. లీగ్ దశలో ఆడిన తొమ్మిది మ్యాచ్ల్లోనూ రోహిత్సేన విజయ పతాక ఎగరవేసింది. ఆదివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో టాపార్డర్ దుమ్మురేపడంతో భారత్ 160 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ను చిత్తుచేసింది. ఇక సెమీస్లో న్యూజిలాండ్తో పోరుకు రోహిత్సేన రెడీ కాగా.. మరో సెమీస్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా అమీతుమీ తేల్చుకోనున్నాయి.
బెంగళూరు: బ్యాటింగ్కు స్వర్గధామం లాంటి వికెట్పై మనవాళ్లు విజృంభించారు. టోర్నీలో ఎదురైన ప్రత్యర్థులందరినీ చిత్తు చేసిన టీమ్ఇండియా.. పండగ పూట నెదర్లాండ్స్పై ఆకలిగొన్న సింహంలా విరుచుకుపడింది. మొదట బ్యాటర్లు రికార్డు సెంచరీలు నమోదు చేస్తే.. ఆ తర్వాత బౌలర్లు డచ్ జట్టు భరతం పట్టారు. లీగ్ దశలో భాగంగా ఆదివారం జరిగిన పోరులో టీమ్ఇండియా 160 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ను మట్టికరిపించి అజేయంగా సెమీస్లో అడుగుపెట్టింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (64 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీలు చేయగా.. రోహిత్ శర్మ (61; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), శుభ్మన్ గిల్ (51; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (51; 5 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు.
టాపార్డర్ కలిసి కట్టుగా కదంతొక్కడంతో వరల్డ్కప్ చరిత్రలో భారత్ తమ రెండో అత్యధిక స్కోరు నమోదు చేసుకుంది. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డీ లీడ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో నెదర్లాండ్స్ 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. తెలుగు కుర్రాడు తేజ నిడమనూరు (54; ఒక ఫోర్, 6 సిక్సర్లు) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్, కుల్దీప్, జడేజా తలా రెండు వికెట్లు తీశారు. ఇక ఈ మెగాటోర్నీలో తొలిసారి బౌలింగ్ చేసిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఒక్కో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. ఈ మ్యాచ్లో భారత్ తొమ్మిది మంది బౌలర్లను వినియోగించడం గమనార్హం. గిల్, సూర్య కూడా బౌలింగ్ చేశారు. శ్రేయస్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. బుధవారం ముంబై వేదికగా జరుగనున్న తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్తో భారత్ తలపడనుంది.
స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా విజయవంతంగా తొలి అంకాన్ని ముగించింది. లీగ్ దశలో ఆడిన తొమ్మిది మ్యాచ్ల్లోనూ నెగ్గిన రోహిత్ సేన అజేయంగా సెమీస్లో అడుగు పెట్టనుంది. గత మెగాటోర్నీ సెమీఫైనల్లో ఓడిన న్యూజిలాండ్తోనే మరోసారి భారత్ తలపడనుంది. ప్రస్తుతం జట్టు వరుస విజయాలతో జోష్లో ఉన్నా.. చరిత్ర చూసుకుంటే నాకౌట్ దశ మనకు అంతగా అచ్చిరాదనే చెప్పాలి. ముఖ్యంగా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీకి వన్డే వరల్డ్కప్ సెమీఫైనల్స్లో ఘోరమైన రికార్డు ఉంది. ఎలాంటి ప్రత్యర్థిపైనైనా తన ప్రతాపం చూపగల కోహ్లీ.. 2011, 2015, 2019 వరల్డ్కప్ సెమీఫైనల్స్లో వరుసగా 9,1,1 పరుగులు మాత్రమే చేశాడు.
మరోవైపు లీగ్ దశలో మన చేతిలో ఓడిన న్యూజిలాండ్ మరింత బలంగా చెలరేగాలని కాచుకొని ఉంది. ఈ నేపథ్యంలో భారత్కు సెమీఫైనల్లో కఠిన సవాల్ ఎదురయ్యే అవకాశాలే ఎక్కువ. బౌలింగ్, బ్యాటింగ్లో మనకు పెద్దగా సమస్యలు లేకపోయినా.. కీలక మ్యాచ్ల్లో టాపార్డర్ చేతులెత్తేసే అలవాటును అధిగమిస్తేనే విజయం వరించనుంది.
రోహిత్, గిల్ రూపంలో చక్కటి ఓపెనర్లు.. కోహ్లీ, శ్రేయస్, రాహుల్, సూర్యతో పటిష్టమైన మిడిలార్డర్ అందుబాటులో ఉన్నప్పటికీ.. కివీస్ బౌలింగ్ను తక్కువ అంచనా వేసేందుకు లేదు. ఇప్పటి వరకు టోర్నీలో భారత్కు ఏ ఒక్క జట్టు కనీస పోటీనివ్వలేకపోయిందనేది వాస్తవమే అయినా.. మరీ గాల్లో తేలిపోతూ వాంఖడేలో అడుగుపెడితే మొదటికే మోసం రావొచ్చు! అందుకే కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకొని ఆడితేనే ఆశలు సజీవంగా ఉంటాయి.
లేదంటే దశాబ్ద కాలంగా ఐసీసీ ట్రోఫీ కోసం ఎదురు చూస్తున్న అభిమానుల ఆగ్రహజ్వాలలకు బలవ్వక తప్పదు. లీగ్ దశలో అయితే కనీసం తిరిగి కోలుకునేందుకైనా అవకాశం ఉండేదేమో.. కానీ, నాకౌట్ కావడంతో సమిష్టిగా సత్తాచాటడం ముఖ్యం. మరో రెండు మ్యాచ్ల వరకు ఇదే జోరు కొనసాగే విధంగా ఏ దిష్టి తగలకపోతే అదే పదివేలు!
9 వరల్డ్కప్లో ఇదే భారత్కు అత్యధిక (9) వరుస విజయాల పరంపర. 2003లో టీమ్ఇండియా వరుసగా 8 మ్యాచ్లు నెగ్గింది. 2003, 07 ప్రపంచకప్లలో 11 విజయాలతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది.
1 వరుసగా రెండు ప్రపంచకప్లో 500 పరుగులు చేసిన ఏకైక బ్యాటర్గా రోహిత్ నిలిచాడు.
ఓవరాల్గా సచిన్ రెండుసార్లు 500 మార్క్ దాటాడు.
1వన్డేల్లో భారత టాప్-5 బ్యాటర్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేయడం ఇదే తొలిసారి. ప్రపంచకప్లోనూ ఇదే అత్యధికం.
3 వరల్డ్కప్లో ఒక జట్టు తొమ్మిది మంది బౌలర్లను వినియోగించడం ఇది మూడో సారి. 1992లో న్యూజిలాండ్, 1987లో ఇంగ్లండ్ ఇలా చేశాయి.
1 ప్రపంచకప్లో భారత్ తరఫున వేగవంతమైన (62 బంతుల్లో) సెంచరీ చేసిన ప్లేయర్గా రాహుల్ రికార్డుల్లోకెక్కాడు.