న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత యువ బాక్సర్ నిఖత్ జరీన్ జోరు కొనసాగుతున్నది. ప్రత్యర్థి ఎవరైనా మట్టికరిపించడమే లక్ష్యంగా దూసుకెళుతున్నది. సోమవారం జరిగిన వేర్వేరు క్వార్టర్స్ బౌట్లలో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్తో పాటు మనీష, పర్విన్ ప్రత్యర్థులపై విజయాలతో సెమీస్లోకి ప్రవేశించారు. దీంతో మెగాటోర్నీలో భారత్కు కనీసం మూడు కాంస్య పతకాలు ఖాయమయ్యాయి. తొలుత జరిగిన 52కిలోల క్వార్టర్స్ బౌట్లో నిఖత్ జరీన్ 5-0 తేడాతో చార్లెసియాన్ టేలర్ డేవిసన్(ఇంగ్లండ్)పై అలవోక విజయం సాధించింది.
ఆది నుంచే పదునైన పంచ్లతో చెలరేగిన ఈ ఇందూరు బాక్సర్ టెక్నికల్ గేమ్తో ఆకట్టుకుంది. ఎక్కడా తడబాటుకు లోనుకాకుండా క్లీన్గా పంచ్లు కురిపిస్తూ పాయింట్లు కొల్లగొట్టింది. రౌండ్ రౌండ్కు జోరు పెంచుతూ ఆధిక్యాన్ని అంతకంతకు పెంచుకుంటూ పోయింది. బుధవారం జరిగే సెమీస్లో బ్రెజిల్ బాక్సర్ కరోలైన్ డీ అల్మెడాతో అమీతుమీ తేల్చుకోనుంది. మరో క్వార్టర్స్లో పర్విన్ 5-0తో షోరియా జుల్కనరోవా (తజకిస్థాన్)పై గెలిచి ముందంజ వేయగా, మనీష 4-1తో నమున్ మన్కోర్ (మంగోలియా)ను ఓడించి సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది. మిగతా బౌట్లలో నీతు(48కి), పూజా రాణి (81కి), అనామిక (50కి), జాస్మైన్ (60కి), నందిని(81కి) ఓటములతో టోర్నీ నుంచి వైదొలిగారు.