INDW vs BANW : భారత మహిళల క్రికెట్ జట్టు(Womens Cricket Team) ఈ ఏడాది తొలి టీ 20 సిరీస్ నెగ్గింది. బంగ్లాదేశ్(Bangladesh) గడ్డపై రెండో టీ 20లో విజయంతో సిరీస్ సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమిండియా రెండో మ్యాచ్లోనూ దుమ్మురేపింది. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్లో భారత్ 8 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తుచేసింది.
ఆఖరి ఓవర్ వరకూ విజయం దోబూచులాడిన పోరులో షఫాలీ వర్మ(Shefali Verma) సంచలన బౌలింగ్తో జట్టును గెలిపించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలుండగానే హర్మన్ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) సేన 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. దీప్తి శర్మ(Deepti Sharma) ‘ప్లేయర్ ఆఫ్ ది అవార్డు’ అందుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 95 పరుగులు మాత్రమే చేసింది. డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ (19) టాప్ స్కోరర్ కాగా.. కెప్టెన్ హర్మన్ప్రీత్ (0), జెమీమా రోడ్రిగ్స్ (8), స్మృతి మంధన (13), హర్లీన్ డియోల్ (6) విఫలమయ్యారు. బంగ్లా బౌలర్లు సుల్తానా ఖాతూన్ 3, ఫాతిమా రెండు వికెట్లు పడగొట్టారు.
3 వికెట్లతో చెలరేగిన దీప్తి శర్మ
స్వల్ప లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ తడబడింది. భారత స్పిన్నర్ల దెబ్బకు 87 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ నిగార్ సుల్తానా (38) మాత్రమే రెండంకెల స్కోరు చేసింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ, షఫాలీ వర్మ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠగా సాగింది. చివరి ఓవర్లో బంగ్లా విజయానికి 10 పరుగులు కావాలి. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ షఫాలీ వర్మకు బంతి ఇచ్చింది. అయితే.. బంగ్లా జట్టు 4 వికెట్లు కోల్పోయి ఒక్క పరుగు మాత్రమే చేసింది. తొలి బంతికి రాబియా రనౌట్ కాగా.. రెండో బంతికి నహిద క్యాచ్ ఔటయ్యింది. నాలుగో బాల్కు ఫాతిమా రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టగా.. ఇన్నింగ్స్ చివరి బంతికి మారూఫా స్టంపౌట్గా వెనదిరిగింది. దాంతో, భారత జట్టు 8 పరుగులతో సంచలన విజయం సాధించింది.