Saeed Ajmal : భారత్ (India)- పాకిస్థాన్ (Pakistan)మ్యాచ్ అంటే చాలు.. అభిమానుల్లో ఎక్కడలేని ఆసక్తి ఉంటుంది. అందుకు తగ్గట్టే దాయాదుల పోరులో పైచేయి సాధిస్తున్న భారత జట్టు పలు రికార్డులు నెలకొల్పింది కూడా. ఓసారి ఇరుజట్ల మధ్య నరాలు తెగేలా జరిగిన ఆ మ్యాచ్లో టీమిండియా 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ(MS Dhoni)కి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'(Player Of The Match) అవార్డు లభించింది. ఆ మ్యాచ్ జరిగి పదేండ్లు దాటింది. అయితే… ఆ మ్యాచ్లో తనకు తీరని అన్యాయం జరిగిందంటూ పాక్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ (Saeed Ajmal) తాజాగా సంచలన కామెంట్స్ చేశాడు.
తనకు దక్కాల్సిన అవార్డును ఉత్త పుణ్యానికే ధోనీ(MS Dhoni)కి ఇచ్చారంటూ తీవ్ర విమర్శలు చేశాడు. ఇంతకీ ఆ రోజు ఏం జరిగిందంటే? పాకిస్థాన్ (Pakistan) జట్టు 2012-13లో రెండు టీ20లు, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం భారత్లో పర్యటించింది. తొలుత జరిగిన రెండు టీ20ల్లో భారత్, పాక్ చెరో మ్యాచ్ గెలిచాయి. ఆ తర్వాత వన్డే సిరీస్లో తొలి రెండు మ్యాచుల్లో పాకిస్థాన్ భారీ విజయాలు సాధించింది. నామమాత్రమైన మూడో వన్డే జనవరి6న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ(Arun Jaitley Stadium) స్టేడియంలో జరిగింది.
సయీద్ అజ్మల్
ఉత్కంఠ రేపిన ఆ మ్యాచ్లో భారత జట్టు (Team India) 10 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ధోనీ సేన అజ్మల్ సెన్షేనల్ బౌలింగ్ చేయడంతో కుప్పకూలింది. 43.4 ఓవర్లలో 167 పరుగులకే ఆలౌటయ్యింది. ఈ మ్యాచ్లో 9.4 ఓవర్లు వేసిన అజ్మల్ 24 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు నేలకూల్చాడు. ఆ తర్వాత పాకిస్థాన్ 48.5 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
“ఆ మ్యాచ్లో నేను ఐదు వికెట్లు పడగొట్టి భారత బ్యాటింగ్ ఆర్డర్ను కుప్పకూల్చాను. ధోనీ 18 పరుగులో… ఎన్నో చేశాడు. రెండు క్యాచ్లు కూడా విడిచిపెట్టేశాడు. అయినప్పటికీ అతడికే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు ఇచ్చారు. ఆటలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఆటగాడికి కదా! దానిని ఇవ్వాల్సింది. చెత్త ప్రదర్శనకు కాదు కదా! ఆ మ్యాచ్లో ఇండియా గెలిచిందని క్యాచ్లు వదిలేసిన ధోనీకి అవార్డు ఇచ్చి దాని పరువు తీశారు” అని పాక్ మాజీ స్పిన్నర్ మండిపడ్డాడు.
అజ్మల్, ధోనీ
అంతేకాదు అప్పట్లో తాను వన్డేలు, టీ20ల్లో ప్రపంచంలోనే నంబర్ 1 బౌలర్నైనని, అయినా కూడా తనకు ఒక్కసారి కూడా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రాలేదని అజ్మల్ ఆవేదన వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లోనూ తనకు అన్యాయం జరిగిందని, నలుగురు బ్యాటర్లను పెవిలియన్ పంపినా తనకు అవార్డు ఇవ్వలేదని తెలిపాడు. ఆ సిరీస్లో తాను సంచనల బౌలింగ్తో జట్టును గెలిపించినా ఒక్కసారి కూడా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకోలేదని అజ్మల్ చెప్పుకొచ్చాడు.
తనకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కలేదన్న ఉక్రోషంలో అజ్మల్(Saeed Ajmal) అబద్ధాలు కూడా అలవోకగా చెప్పేశాడు. ఆ మ్యాచ్లో ధోనీ 18 పరుగులు చేశాడని అజ్మల్ అన్నాడు. కానీ, 55 బంతులాడిన ధోనీ మూడు సిక్సర్లు, ఒక ఫోర్తో 36 పరుగులు చేశాడు. లో స్కోరింగ్ మ్యాచ్లో అతను చేసిన 36 పరుగులు ఎంతో విలువైనవి. అంతేకాదు, జట్టులో మహీనే టాప్ స్కోరర్.
36 పరుగులు చేసిన ధోనీ
అలానే.. అజ్మల్ చెప్పినట్టు ధోనీ రెండు క్యాచ్లు వదిలిపెట్టలేదు. మరో విషయం ఏంటంటే..? అజ్మల్ (1) ఇచ్చిన అత్యంత క్లిష్టమైన క్యాచ్ను ధోనీ పట్టుకున్నాడు. అంతేకాదు ప్రమాదకరంగా మారుతున్న ఉమర్ అక్మల్ (25)ను స్టంపౌట్ చేశాడు. మ్యాచ్ను మలుపుతిప్పిన ప్రదర్శన చేసినందుకే ధోనీకి ఆరోజు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్నని చెప్పుకునే అజ్మల్కు ఆ విషయం తెలియకపోవడం సిగ్గుచేటు.