Indian Hockey Team : స్పెయిన్లో జరుగుతున్న ఐదు దేశాల టోర్నమెంట్లో భారత మహిళల హాకీ జట్టు(Indian Hockey Team)కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. తొలి పోరులో స్పెయిన్(Spain) చేతిలో కంగుతిన్న టీమిండియా.. రెండో మ్యాచ్లో బెల్జియం చేతిలో ఓటమి పాలైంది. శనివారం బెల్జియం(Belgium)తో జరిగిన మ్యాచ్లో 1-2తో మ్యాచ్ చేజార్చుకుంది. భారత్ తరఫున వైష్ణవి విఠల్ ఫాల్కే(Vaishnavi Vitthal Phalke) 56 వ నిమిషంలో ఏకైక గోల్ చేసింది.
మ్యాచ్ ఆరంభం నుంచి ఇరుజట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే.. బెల్జియం డిఫెన్స్ను అడ్డుకునేందుకు భారత ప్లేయర్లు ప్రయత్నించి విఫలయమ్యారు. దాంతో, తొలి రెండు గోల్స్ కొట్టిన బెల్జియం ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అంబ్రే బల్లెన్ఘీన్ 22వ నిమిషంలో, లూసీ వెర్సవెల్ 37వ నిమిషంలో గోల్ చేశారు. మ్యాచ్ మరికాసేపట్లో ముగుస్తుందనగా భారత్ తరఫున వైష్ణవి గోల్ కొట్టింది. ఆ తర్వాత బెల్జియం గోల్పోస్ట్పై టీమిండియా దాడి చేసినా ఫలితం లేకపోయింది. తదుపరి మ్యాచ్లో భారత్ డిసెంబర్ 19న జర్మనీతో తలపడనుంది.