WFI | భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అడ్ హక్ కమిటీ రద్దు అయింది. గతేడాది ఏర్పాటైన ఈ కమిటీని రద్దు చేస్తున్నట్టు సోమవారం భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ మేరకు ఐవోఏ స్పందిస్తూ.. గత నెలలో ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) డబ్ల్యూఎఫ్ఐపై నిషేధం ఎత్తేసిన నేపథ్యంలో ఇకపై అడ్హక్ కమిటీ అవసరం లేదని తెలిపింది. ఐవోఏ తాజా నిర్ణయంతో ఇకనుంచి సంజయ్ సింగ్ నేతృత్వంలోని ప్యానెల్.. డబ్ల్యూఎఫ్ఐని నడిపించనుంది.
సోమవారం ఐవోఏ స్పందిస్తూ.. ‘డబ్ల్యూఎఫ్ఎఫ్పై ఉన్న నిషేధాన్ని ఫిబ్రవరిలో యూడబ్ల్యూడబ్ల్యూ ఎత్తేసింది. ఈ నేపథ్యంలో డిసెంబర్లో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన అడ్ హక్ కమిటీని రద్దు చేయాలని నిర్ణయించాం..’ అని తెలిపింది.
అడ్హక్ కమిటీ పూర్వాపరాలు..
గత ఏడాది డబ్ల్యూఎఫ్ఐలో ఎన్నికలు జరిగినా మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు సన్నిహితుడైన సంజయ్ సింగ్ గెలవడం.. ఆ తర్వాత అతడు సెలక్షన్స్ ట్రయల్స్ గురించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేగడంతో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ డబ్ల్యూఎఫ్ఐను సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఐవోఏ.. భూపేంద్ర సింగ్ బజ్వా నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన అడ్హక్ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీని తాము గుర్తించబోమని సంజయ్ సింగ్ గతంలో ప్రకటించాడు. కానీ అడ్హక్ కమిటీ మాత్రం కొద్దిరోజుల క్రితమే ఒలింపిక్ క్వాలిఫయర్స్ కోసం సెలక్షన్ ట్రయల్స్ను కూడా విజయవంతంగా నిర్వహించింది.
థ్యాంక్యూ ఐవోఏ..
ఐవోఏ తాజా నిర్ణయంపై సంజయ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఆయన స్పందిస్తూ… ‘డబ్ల్యూఎఫ్ఐ మీద మాకు పూర్తి నియంత్రణ ఇచ్చినందుకు ఐవోఏకు ధన్యవాదాలు. రెజ్లర్లకు మేం అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. త్వరలోనే రెజ్లర్ల కోసం జాతీయ స్థాయి క్యాంప్ ఏర్పాటుచేస్తాం. ఒకవేళ రెజ్లర్లు విదేశాల్లో శిక్షణ కావాలని కోరుకుంటే అందుకు సహకరిస్తాం. ఇప్పుడు మా దృష్టి అంతా ఒలింపిక్స్ మీదే..’ అని తెలిపాడు.