Asian Games 2023 : ఆసియా గేమ్స్లో భారత పురుషుల(Indian Mens Team), మహిళల క్రికెట్ జట్ల(Indian Womens Team)కు క్వార్టర్ ఫైనల్ బెర్తులు ఖరారు అయ్యాయి. ఆసియాకు చెందిన టాప్ -4లోని జట్లకు నేరుగా క్వార్టర్ ఫైనల్కు ఎంట్రీ లభించింది. భారత్తో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లకు కూడా క్వార్టర్స్ బెర్తు దక్కింది. భారత పురుషుల జట్టు మ్యాచ్లు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 7 వరకు జరుగుతాయి. అదే.. మహిళల జట్టు మ్యాచ్లు సెప్టెంబర్ 19 నుంచి 26 వరకు జరుగుతాయి.
పురుషుల విభాగంలో మొత్తం 18 జట్లు పోటీ పడనుండగా, మహిళల విభాగంలో 14 జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. చైనాలోని హంగ్జో(Hangzhou)లో ఉన్న జీజియాంగ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ(Zhejiang University of Technology) క్రికెట్ పోటీలకు ఆతిథ్యం ఇస్తోంది. భారత క్రికెట్ జట్లు ఆసియా గేమ్స్లో పాల్గొనడం ఇదే మొదటిసారి. 2010, 2014లో క్రికెట్ను అనుమతించినప్పటికీ బీసీసీఐ మాత్రం మన జట్టును పంపలేదు.
రుతురాజ్ గైక్వాడ్
ఆసియా గేమ్స్కు సీనియర్ జట్టును కాకుండా జూనియర్ జట్టును బీసీసీఐ పంపించనుంది. రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) సారథ్యంలో భారత జట్టు టైటిల్ కోసం పోటీ పడనుంది. ఇప్పటికే 19మందితో కూడిన మెన్స్, ఉమెన్స్ స్క్వాడ్ను ప్రకటించిన విషయం తెలిసిందే.
మహిళల జట్టు ఒకవేళ క్వార్టర్లో విజయం సాధిస్తే 25న సెమీస్ ఆడనుంది. గోల్డ్ మెడల్, కాంస్య పతకం పోరు సెప్టెంబర్ 26 నుంచి జరుగుతాయి. అయితే.. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్(Harmanpreet Kaur)పై రెండు మ్యాచ్ల నిషేధం టీమిండియా అవకాశాలపై ప్రభావం చూపనుంది.
హర్మన్ప్రీత్ కౌర్
బంగ్లాదేశ్తో ‘టై’గా ముగిసిన మూడో వన్డేలో హర్మన్ప్రీత్ దురుసు ప్రవర్తనతో విమర్శల పాలైంది. బ్యాట్తో వికెట్లను కొట్టడమే కాకుండా మ్యాచ్ తర్వాత అంపైర్ తీరును తప్పుపట్టింది. అందువల్ల ఐసీసీ ఆమెకు మ్యాచ్ ఫీజులో 75 శాతం జరిమానా, నాలుగు డీమెరిట్ పాయింట్లు విధించింది. అంతటితో ఆగకుండా రెండు మ్యాచ్ల నిషేధం కూడా వర్తింపజేసింది.