Asia Team Championship 2024: మలేషియా వేదికగా జరుగుతున్న బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్షిప్లో భారత మహిళల జట్టు క్వార్టర్స్ పోరుకు అర్హత సాధించింది. అత్యంత కఠిన ప్రత్యర్థి అయిన చైనాను ఓడించిన భారత మహిళల జట్టు క్వార్టర్స్ ఫైనల్స్కు చేరుకుంది. భారత్ 3-2 తేడాతో చైనా గండాన్ని దాటింది. గాయం కారణంగా సుమారు నాలుగు నెలల తర్వాత రాకెట్ పట్టిన తెలుగమ్మాయి పీవీ సింధు.. స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఇచ్చింది. సింధుతో పాటు అన్మోల్ ఖర్బ్ అద్భుత పోరాటంతో భారత్ క్వార్టర్స్కు అర్హత సాధించింది.
మూడు సింగిల్స్ మ్యాచ్లు, రెండు డబుల్స్ మ్యాచ్లు ఉన్న ఈ పోరులో భాగంగా మొదటి సింగిల్స్ మ్యాచ్లో సింధు.. 21-17, 21-15 తేడాతో హాన్ యూ ను ఓడించి భారత్కు 1-0 ఆధిక్యాన్ని తెచ్చిపెట్టింది. అయితే ఉమెన్స్ డబుల్స్లో చైనా ద్వయం లు షెంగ్ షు – తాన్ నింగ్.. 21-19, 21-16 తేడాతో భారత జోడీ తనీషా కాస్ట్రో, అశ్విని పొన్నప్పలను ఓడించి స్కోరును 1-1 తో సమం చేసింది.
రెండో సింగిల్స్ పోరులో వాంగ్ జి యి.. 21-13, 21-15 తేడాతో అష్మిత చలియాను ఓడించడంతో చైనా 2-1 ఆధిక్యాన్ని దక్కించుకుంది. మరో డబుల్స్ మ్యాచ్లో భారత జోడీ త్రీసా జోలీ – గాయత్రి గోపీచంద్.. 10-21, 21-18, 21-17 తేడాతో చైనా జంట లి యి జింగ్ – లు జు మిన్ లపై విజయం సాధించి స్కోరును 2-2తో సమం చేశారు.
We enter quarterfinals as table toppers after beating 🇨🇳 3-2, let that sink in 🔥
Proud of you girls, keep it up! 👊#BATC2024#TeamIndia#IndiaontheRise#Badminton pic.twitter.com/ysFhXwICTw
— BAI Media (@BAI_Media) February 14, 2024
ఈ క్రమంలో అత్యంత కీలకమైన ఆఖరి పోరులో పదిహేడేళ్ల భారత క్రీడాకారిణి అన్మోల్ ఖర్బ్.. 22-20, 14-21, 21-18 తేడాతో వు లు యు ను ఓడించడంతో భారత్ 3-2 ఆధిక్యం దక్కించుకుని క్వార్టర్స్కు చేరుకుంది. 472వ ర్యాంకర్ అయిన అన్మోల్.. 149వ చైనా ర్యాంకర్పై తాడో పేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో అత్యద్భుతంగా పోరాడి భారత్ క్వార్టర్స్ చేరడంలో కీలకపాత్ర పోషించింది.