బాంకాక్ : ఆసియన్ ఆర్చరీ చాంపియన్షిప్లో భారత ఆర్చర్లు బుధవారం రెండు కాంస్యాలు దక్కించుకున్నారు. అంతేగాక మరో నాలుగు విభాగాల్లో ఫైనల్స్కు చేరి పతకాలు ఖాయం చేసుకున్నారు. పురుషుల కాంపౌండ్ విభాగంలో అభిషేక్ వర్మ, ప్రథమేష్ ఫుజె, ప్రియాంశ్లతో కూడిన భారత జట్టు షూటాఫ్లో 29-28 స్కోరుతో చైనీస్ తైపీని ఓడించి కాంస్యం గెలుచుకుంది. కాగా పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో అభిషేక్ వర్మ కాంస్యం గెలుచుకున్నాడు.
మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో జ్యోతి సురేఖ, పర్ణీత్ కౌర్ ఫైనల్స్కు చేరి స్వర్ణ, రజత పతకాలు ఖాయం చేశారు. కాంపౌండ్ టీమ్ విభాగంలోనూ భారత జట్టు థాయిలాండ్ను ఓడించి ఫైనల్కు చేరింది. ఫైనల్లో చైనీస్ తైపీతో తలపడుతుంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలోనూ భారత జట్టు ఫైనల్స్కు చేరుకుంది.