కొలంబో: శ్రీలంకతో రెండో వన్డేలో భారత్ ఉత్కంఠ విజయాన్ని సాధించింది. ఓ దశలో ఓటమి అంచున నిలిచిన భారత్… దీపక్ చహర్ (82 బంతుల్లో 69 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) పోరాటంతో 3 వికెట్లతో విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 275 పరుగులు చేసింది.
చరిత్ అసలంక (65; 6 ఫోర్లు), అవిష్క ఫెర్నాండో (50; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు సాధించారు. భువనేశ్వర్, చహల్ చెరో 3 వికెట్లు పడగొట్టగా, దీపక్ చహర్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం 276 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 49.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (44 బంతుల్లో 53; 6 ఫోర్లు) దూకుడుగా ఆడాడు. భువనేశ్వర్ కుమార్ (28 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు) చివర్లో చహర్కు చక్కని సహకారం అందించాడు. భారత్ 193/7తో కష్టాల్లో పడిన దశలో వీరిద్దరూ ఎనిమిదో వికెట్కు అజేయంగా 84 పరుగులు జోడించి జట్టును విజయతీరాలకు చేర్చారు. ప్రత్యర్థి బౌలర్లలో వనిందు హసరంగ 3 వికెట్లు పడగొట్టాడు.