మెగాటోర్నీకి బయలుదేరే ముందు టీమ్ఇండియా ఆడిన చివరి టీ20లో పరాజయం పాలైంది. ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి మితిమీరిన ప్రయోగాలు చేసిన రోహిత్ సేన అందుకు తగ్గ మూల్యం చెల్లించుకుంది. తొలి రెండు మ్యాచ్ల్లో విజయాలతో సిరీస్ ఖాతాలో వేసుకున్న భారత్.. ఆఖరి పోరులో ఆకట్టుకోలేకపోయింది. పసలేని టీమ్ఇండియా బౌలింగ్ను దక్షిణాఫ్రికా ఆటగాళ్లు చెడుగుడాడుకున్నారు. రాసో అజేయ శతకంతో కదంతొక్కగా.. డికాక్ దంచికొట్టాడు. కొండంత లక్ష్యఛేదనలో టీమ్ ఇండియా ఏ దశలోనూ పోటీనివ్వలేకపోయింది!
ఇండోర్: పొట్టి ప్రపంచకప్ ప్రారంభానికి ముందు టీ20 ఫార్మాట్లో ఆడిన చివరి పోరులో టీమ్ఇండియా పరాజయం పాలైంది. తొలి రెండు మ్యాచ్ల్లో ఓడి సిరీస్ కోల్పోయిన దక్షిణాఫ్రికా.. నామమాత్రమైన పోరులో ఓదార్పు విజయం దక్కించుకుంది. మంగళవారం ఇక్కడ జరిగిన మూడో టీ20లో దక్షిణాఫ్రికా 49 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. గత మ్యాచ్లో విజయానికి చేరువగా వచ్చి ఓటమి పాలైన సఫారీలు ఈసారి ఆరంభం నుంచే దంచుడు ప్రారంభించారు. కెప్టెన్ టెంబా బవుమా (3) వరుసగా మూడో మ్యాచ్లోనూ విఫలం కాగా.. రిలీ రాసో (48 బంతుల్లో 100 నాటౌట్; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) సెంచరీ నమోదు చేసుకున్నాడు.
క్వింటన్ డికాక్ (43 బంతుల్లో 68; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో స్టబ్స్ (23; 2 ఫోర్లు, ఒక సిక్సర్), డేవిడ్ మిల్లర్ (5 బంతుల్లో 19 నాటౌట్; 3 సిక్సర్లు) దంచికొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో భారత్ 18.3 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటైంది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ లోకేశ్ రాహుల్కు ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతినివ్వగా.. కెప్టెన్ రోహిత్ శర్మ (0), శ్రేయస్ అయ్యర్ (1), సూర్యకుమార్ యాదవ్ (8), అక్షర్ పటేల్ (9) విఫలమయ్యారు. ఓపెనర్గా బరిలోకి దిగిన రిషబ్ పంత్ (14 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఉన్నంతసేపు ధాటిగా ఆడగా.. దినేశ్ కార్తీక్ (21 బంతుల్లో 46; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఎడాపెడా బౌండ్రీలు బాదుతూ ఇండోర్ స్టేడియాన్ని హోరెత్తించాడు. ఆఖర్లో దీపక్ చాహర్ (17 బంతుల్లో 31; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), ఉమేశ్ యాదవ్ (20 నాటౌట్) ఓటమి అంతరాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. సఫారీ బౌలర్లలో ప్రిటోరియస్ 3, కేశవ్ మహరాజ్, ఎంగ్డీ, పార్నెల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. రాసోకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, సూర్యకు‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’అవార్డులు దక్కాయి. రోహిత్ సేన సారథ్యంలోని టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ కోసం గురువారం ఆస్ట్రేలియా బయలుదేరనుండగా.. శిఖర్ ధవన్ సారథ్యంలోని ద్వితీయ శ్రేణి భారత జట్టు దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుంది.
దక్షిణాఫ్రికా: 20 ఓవర్లలో 227/3 (రాసో 100 నాటౌట్, డికాక్ 68; ఉమేశ్ 1/34, దీపక్ 1/48),
భారత్: 18.3 ఓవర్లలో 178 ఆలౌట్ (కార్తీక్ 46, దీపక్ చాహర్ 31; ప్రిటోరియస్ 3/26, కేశవ్ 2/34).