IND vs WI : భారత్ – వెస్టిండీస్ మధ్య క్వీన్స్ పార్క్ ఓవల్(Queen’s Park Oval)లో జరిగిన రెండో టెస్టు అనూహ్యంగా డ్రాగా ముగిసింది. వరుణుడు శాంతించకపోవడంతో సిరీస్ క్వీన్ స్వీప్ చేయాలనుకున్న టీమిండియా(Team India) కల నెరవేరలేదు. అయినా కూడా తొలి టెస్టులో గెలవడంతో 1-0తో రోహిత్ శర్మ బృందం సిరీస్ సొంతం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లతో చెలరేగిన భారత పేసర్ సిరాజ్ (mohammad siraj)కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు ఇచ్చారు. ఆ తర్వాత ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు విజేతను ప్రకటిస్తారని అంతా అనుకున్నారు.
ఆశ్చర్యకరంగా.. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'(player of the series) అవార్డు మాత్రం ఎవరికీ ప్రకటించలేదు. దాంతో, ఇరుజట్ల ఆటగాళ్లు ఒకింత షాక్ అయ్యారు. ఈ అవార్డు ఇవ్వకపోవడానికి కారణం ఏంటనేది కూడా ఇప్పటివరకూ తెలియలేదు. ఈ విషయంపై స్పందించేందుకు ఇరుజట్ల కెప్టెన్లు ఆసక్తి చూపకపోవడం విశేషం. అయితే.. మరికొన్ని గంటల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
టెస్టుల్లో తొలి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న సిరాజ్
మొదట రోహిత్ సేన తొలి ఇన్నింగ్స్లో 438 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(121) క్లాసిక్ సెంచరీతో మెరిశాడు. ఆ తర్వాత సిరాజ్ దెబ్బకు విండీస్ 255 పరుగులకు ఆలౌటైంది.రెండో ఇన్నింగ్స్లో టీమిండియా టీ20 తరహాలో దంచికొట్టడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(57), ఇషాన్ కిషన్(52) అర్ధ శతకాలతో చెలరేగారు.
ఇషాన్ కిషన్(52)
భారీ ఆధిక్యం రావడంతో 181/2 వద్ద రోహిత్ రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు. 365 పరుగుల లక్ష్య ఛేదనలో విండీస్ నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. ఐదో రోజు విండీస్ ఆట కట్టించాలనుకున్న భారత్ ఆశ ఫలించలేదు. వర్షం తగ్గకపోవడంతో ఒక్క బంతి కూడా పడలేదు. దాంతో, తొలి టెస్టు గెలిచిన భారత్ 1-0తో సిరీస్ సొంతం చేసుకుంది. ఇరుజట్ల మధ్య జూలై 27 నుంచి వన్డే సిరీస్ మొదలవ్వనుంది. ఇప్పటికే భారత్, వెస్టిండీస్ జట్లు 15మంది స్క్వాడ్ను ప్రకటించాయి.