Bismah Maroof : పాకిస్థాన్ మహిళా జట్టు మాజీ కెప్టెన్ బిస్మాహ్ మరూఫ్(Bismah Maroof ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఆసియా గేమ్స్(Asian Games 2023) నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. అందుకు ఈ ఆల్రౌండర్ చెప్పిన కారణం ఏంటో తెలుసా..? టోర్నీ పిల్లలను అనుమతించకపోవడమే. అవును.. టోర్నమెంట్లో ఆడే క్రికెటర్లు తమ పిల్లల్ని వెంట తీసుకురావొద్దని ఆసియా గేమ్స్ నిర్వాహకులు ఓ నియమం పెట్టారు. దాంతో, రెండేళ్ల చంటిబిడ్డను వదిలి వెళ్లడం ఇష్టం లేని మరూఫ్ టోర్నీ నుంచి తప్పుకుంది.
‘దురృష్టవశాత్తూ పాక్ జట్టు బిస్మాహ్ మరుఫే సేవల్ని కోల్పోనుంది. పిల్లల్ని వెంట తీసుకురావొద్దనే నియమం కారణంగా ఆమె తన చిన్న పాపతో చైనాకు రాలేని పరిస్థితి’ అని మహిళల జట్టు హెడ్ తానియా మల్లిక్(Tania Mallick) తెలిపింది. ఈ ఏడాది ఆసియా గేమ్స్ సెప్టెంబర్ 19 నుంచి 26 వరకు జరగనున్నాయి.
కూతురితో బిస్మాహ్
బిస్మాహ్ పాక్ ప్రధాన బ్యాటర్లలో ఒకరు. ఎడమ చేతివాటం బ్యాటర్ అయిన ఆమె లెగ్ స్పిన్ కూడా వేయగలదు. బిడ్డకు జన్మనివ్వడం కోసం బిస్వాహ్ 2021 ఏప్రిల్లో బ్రేక్ తీసుకుంది. మళ్లీ అదే ఏడాది డిసెంబర్లో మైదానంలో అడుగుపెట్టింది. 2022లో బిస్మాహ్ పరుగుల వరద పారించింది. పాక్ మహిళల జట్టు తరఫున ఆ ఏడాది వన్డేలు, టీ20ల్లో అత్యధిక పరుగులు కొట్టి రికార్డు సృష్టించింది. అంతేకాదు ఒక్క సెంచరీ లేకుండానే వన్డేల్లో ఎక్కువ పరుగులు చేసిన రికార్డు ఆమె పేరు మీదే ఉంది. అవును.. బిస్మాహ్ 3,017 రన్స్ సాధించింది.
ఆసియా గేమ్స్లో పాకిస్థాన్ జట్టుకు మంచి రికార్డు ఉంది. వరుసగా రెండు సార్లు పాక్ ఆసియా గేమ్స్లో స్వర్ణ పతకం సాధించింది. 2010లో చైనాలోని ఇంచెయాన్లో, 2014లో దక్షిణ కొరియాలో జరిగిన పోటీల్లో విజేతగా నిలిచింది. దాంతో ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని అనుకుంది. కానీ, స్టార్ ప్లేయర్ బిస్మాహ్ మరూఫ్ అనూహ్యంగా టోర్నీ నుంచి తప్పుకోవడం ఆ జట్టు అవకాశాలపై ప్రభావం చూపనుంది.
2014 ఆసియా గేమ్స్లో గెలుపొందిన పాక్ జట్టు
ఈమధ్యే పాక్కు చెందిన అయేషా నసీమ్(Ayesha Naseem) క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల వయసులోనే ఆమె ఆట నుంచి తప్పకొని అందర్నీ షాక్కు గురి చేసింది. ఇస్లాం మత సంప్రదాయలను నిబద్ధతో పాటించాలనే ఉద్దేశంతో క్రికెట్ను వదిలేస్తున్న అని ఆమె చెప్పింది.