ప్రధాన ఆటగాళ్లు అందుబాటులో లేకున్నా యంగ్ఇండియా సిరీస్ విజయం సాధించింది. వరుణుడి దోబూచులాట మధ్య సాగిన పోరు చివరకు ‘టై’గా ముగియగా.. గత మ్యాచ్లో ఘన విజయం సాధించిన భారత్ 1-0తో సిరీస్ కైవసం చేసుకుంది. హైదరాబాదీ పేసర్ సిరాజ్ దుమ్మురేపగా.. అర్ష్దీప్సింగ్ అతడికి అండగా నిలిచాడు.
నేపియర్: బౌలర్లు రాణించడంతో న్యూజిలాండ్పై టీమ్ఇండియా సిరీస్ విజయం సాధించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మంగళవారం ఇక్కడ జరిగిన ఆఖరి టీ20 డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ‘టై’గా ముగియడంతో భారత్ 1-0తో సిరీస్ కైవసం చేసుకుంది. వర్షం కారణంగా ఒక్క బంతి పడకుండానే తొలి మ్యాచ్ రద్దు కాగా.. రెండో టీ20లో సూర్యకుమార్ శతక్కొట్టడంతో హార్దిక్ సేన విజయం సాధించింది. తాజా పోరులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 19.4 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. కాన్వే (59), ఫిలిప్స్ (54) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. ఒక దశలో 130/2తో పటిష్టంగా కనిపించిన న్యూజిలాండ్.. ఆ తర్వాత సిరాజ్ (4/17), అర్ష్దీప్ (4/37) ధాటికి 30 పరుగుల వ్యవధిలో మిగిలిన ఎనిమిది వికెట్లు కోల్పోయింది.
అలెన్ (3), చాప్మన్ (12), మిషెల్ (10), నీషమ్ 90), శాంట్నర్ (1) విఫలమయ్యారు. అనంతరం లక్ష్యఛేదనలో టీమ్ఇండియా 9 ఓవర్లలో 75/4తో నిలిచిన సమయంలో మ్యాచ్కు వర్షం అడ్డంకిగా మారింది. ఎంతకీ వరుణుడు శాంతించకపోవడంతో డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఫలితం తేల్చారు. ఇషాన్ కిషన్ (10), రిషబ్ పంత్ (11), శ్రేయస్ అయ్యర్ (0) మరోసారి విఫలం కాగా.. హార్దిక్ పాండ్యా (18 బంతుల్లో 30 నాటౌట్; 3 ఫోర్లు, ఒక సిక్సర్) పోరాడాడు. ‘360 డిగ్రీస్ ప్లేయర్’ సూర్యకుమార్ యాదవ్ (13; ఒక ఫోర్, ఒక సిక్సర్) ఉన్నంతసేపు ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. నాలుగు ఓవర్లలో 17 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టిన సిరాజ్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, సూర్యకుమార్ యాదవ్కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి. ఇరు జట్ల మధ్య శుక్రవారం ఆక్లాండ్లో తొలి వన్డే జరుగనుంది.
న్యూజిలాండ్: 19.4 ఓవర్లలో 160 ఆలౌట్ (కాన్వే 59, ఫిలిప్స్ 54; సిరాజ్ 4/17, అర్ష్దీప్ 4/37),
భారత్: 9 ఓవర్లలో 75/4 (పాండ్యా 30 నాటౌట్, సూర్యకుమార్ 13; సౌథీ 2/27).