పొట్టి ప్రపంచకప్లో టీమ్ఇండియా మూడో విజయం నమోదు చేసుకుంది. ఒక దశలో ఓటమఖాయమనుకున్న పోరులో వరుణుడు రోహిత్ సేనకు అండగా నిలిచాడు. కింగ్ కోహ్లీ రికార్డు అర్ధశతకానికి.. రాహుల్ మెరుఫు హాఫ్ సెంచరీ తోడవడంతో మొదట భారత్ మంచి స్కోరు చేయగా.. బంగ్లా ఓపెనర్ లిటన్ దాస్ వీరబాదుడుతో టీమ్ఇండియాను భయపెట్టాడు. ఈ దశలో మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించగా.. ఆ తర్వాత విజృంభించిన భారత్ వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టి బంగ్లాను కట్టడి చేసింది. ఈ గెలుపుతో సెమీస్కు చేరువైన రోహిత్ సేన ఆదివారం చివరి లీగ్ మ్యాచ్లో జింబాబ్వేతో తలపడనుంది.
అడిలైడ్: పొట్టి ప్రపంచకప్లో టీమ్ఇండియా సెమీఫైనల్కు చేరువైంది. అనూహ్య మలుపులు తిరిగిన పోరులో బుధవారం రోహిత్ సేన 5 పరుగుల తేడాతో (డక్వర్త్ లూయిస్ పద్ధతిలో) బంగ్లాదేశ్పై విజయం సాధించింది. గ్రూప్-2లో నాలుగు మ్యాచ్లాడిన భారత్.. ఈ గెలుపుతో 6 పాయింట్లు ఖాతాలో వేసుకొని టాప్లో కొనసాగుతున్నది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 184 పరుగులు చేసింది. ఫుల్ ఫామ్లో ఉన్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (44 బంతుల్లో 64 నాటౌట్; 8 ఫోర్లు, ఒక సిక్సర్) ఈ ప్రపంచకప్లో మూడో అర్ధశతకం బాదగా.. గత మూడు మ్యాచ్ల్లో విఫలమైన ఓపెనర్ కేఎల్ రాహుల్ (32 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
సూర్యకుమార్ (16 బంతుల్లో 30; 4 ఫోర్లు) ఉన్నంతసేపు ధాటిగా ఆడగా.. కెప్టెన్ రోహిత్ శర్మ (2), హార్దిక్ పాండ్యా (5), దినేశ్ కార్తీక్ (7), అక్షర్ పటేల్ (7) విఫలమయ్యారు. చివర్లో అశ్విన్ (6 బంతుల్లో 13 నాటౌట్; ఒక ఫోర్, ఒక సిక్సర్) విలువైన పరుగులు రాబట్టాడు. బంగ్లా బౌలర్లలో హసన్ మహ్మూద్ 3, షకీబల్ హసన్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం వర్షం కారణంగా బంగ్లాదేశ్ లక్ష్యాన్ని 16 ఓవర్లలో 151కి కుదించగా.. ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయి 145 రన్స్ చేసింది. ఓపెనర్ లిటన్ దాస్ (27 బంతుల్లో 60; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) ఉన్నంతసేపు వీర విధ్వంసం సృష్టించగా.. వర్ష విరామం తర్వాత మన వాళ్లు చెలరేగిపోయారు. భారత బౌలర్లలో అర్శ్దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. కోహ్లీకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఆ రనౌట్.. అద్భుతం
బంగ్లా ఓపెనర్లను విడదీసేందుకు భారత బౌలర్లు ఎంత ప్రయత్నించినా.. ఫలితం దక్కని వేళ కేఎల్ రాహుల్ సూపర్ త్రోతో టీమ్ఇండియాకు బ్రేక్ త్రూ అందించాడు. అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ రెండో బంతిని నజ్ముల్ హసన్ మిడ్వికెట్ వైపు ఆడి రెండో పరుగు కోసం ప్రయత్నించగా.. బౌండ్రీ దగ్గర నుంచి పరిగెత్తుకొచ్చిన రాహుల్.. 34 మీటర్ల దూరం నుంచి డ్రైరెక్ట్ త్రోతో నాన్స్ట్రయికర్ ఎండ్ వికెట్లు గిరాటేశాడు. దీంతో అప్పటి వరకు ధాటిగా ఆడిన లిటన్ దాస్ భారంగా మైదానం వీడాడు.
అంతకుముందు.. ఆ తర్వాత
లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్ లిటన్ దాస్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో భారత్ ఓటమి ఖాయమనిపించింది. బౌలర్తో సంబంధం లేకుండా రెచ్చిపోయిన లిటన్.. పవర్ ప్లే ముగియకముందే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. 6 ఓవర్లలో జట్టు స్కోరు 60 కాగా.. అందులో లిటన్ చేసినవే 56 పరుగులు ఉండటం విశేషం. బంగ్లా 7 ఓవర్లలో 66/0తో ఉన్న సమయంలో మ్యాచ్కు వరుణుడు అడ్డుపడ్డాడు. డీఎల్ఎస్ ప్రకారం అప్పటికే బంగ్లా ముందంజలో ఉండగా.. దాదాపు గంట తర్వాత మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. దీంతో లక్ష్యాన్ని 16 ఓవర్లలో 151కి కుదించారు.
ఈ స్థితిలో బంగ్లా విజయానికి 54 బంతుల్లో 85 పరుగులు అవసరమైన దశలో మన బౌలర్లు విజృంభించారు. రాహుల్ వేసిన కండ్లు చెదిరే త్రోతో లిటన్ దాస్ రనౌట్ రూపంలో వెనుదిరగగా.. అక్కడి నుంచి బంగ్లా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. మరో ఓపెనర్ నజ్ముల్ హుసేన్ (21)ను షమీ బుట్టలో వేసుకోగా.. అర్శ్దీప్ ఓకే ఓవర్లో అఫిఫ్ హుసేన్ (3), కెప్టెన్ షకీబల్ హసన్ (13)ను ఔట్ చేశాడు. తదుపరి ఓవర్లో యాసిర్ షా (1), మొసద్దిక్ హుసేన్ (6)ను హార్దిక్ పాండ్యా పెవిలియన్ బాట పట్టించడంతో టీమ్ఇండియా మ్యాచ్పై పట్టుబిగించింది. చివర్లో నూరుల్ హసన్ (14 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు, ఒక సిక్సర్), తస్కీన్ అహ్మద్ (12 నాటౌట్; ఒక ఫోర్, ఒక సిక్సర్) పోరాటం ఓటమి అంతరాన్నితగ్గించేందుకే పరిమితమైంది.
1 టీ20 ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ (1065) రికార్డుల్లోకెక్కాడు. జయవర్ధనే (1016) రెండో స్థానంలో ఉన్నాడు.
1 టీ20 ప్రపంచకప్లో అత్యధిక (13) ఫిఫ్టీ+ స్కోర్లు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. రోహిత్ (9) రెండో స్థానంలో ఉన్నాడు.
సంక్షిప్త స్కోర్లు
భారత్: 20 ఓవర్లలో 184/6 (కోహ్లీ 64 నాటౌట్, రాహుల్ 50; మహ్మూద్ 3/47, షకీబ్ 2/33), బంగ్లాదేశ్: 16 ఓవర్లలో 145/6 (లిటన్ దాస్ 60, నూరుల్ హసన్ 25 నాటౌట్; పాండ్యా 2/28, అర్శ్దీప్ 2/38).