IND vs WI | సులువుగా గెలువాల్సిన మ్యాచ్లో టీమ్ఇండియా పరాజయం పాలైంది. మొదట బౌలర్లు సమిష్టిగా సత్తాచాటడంతో కరీబియన్లను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన భారత్.. ఆనక ఛేదనలో తడబడింది. 30 బంతుల్లో 37 పరుగులు చేయాల్సిన దశలో చేతిలో 6 వికెట్లు ఉన్న హార్దిక్ సేన.. ఒత్తిడికి చిత్తైంది. మ్యాచ్ ఓడినా తెలంగాణ కుర్రాడు తిలక్ వర్మ అంతర్జాతీయ అరంగేట్రంలోనే అదిరిపోయే ఇన్నింగ్స్తో దుమ్మురేపాడు!
టరోబా: వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా విండీస్లో పర్యటిస్తున్న టీమ్ఇండియా.. స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోతున్నది. టెస్టు, వన్డే సిరీస్లను చేజిక్కించుకున్న భారత్.. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను పరాజయంతో ప్రారంభించింది. గురువారం జరిగిన తొలి పోరులో టీమ్ఇండియా విండీస్ చేతిలో 4 పరుగుల తేడాతో ఓడింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. కెప్టెన్ రావ్మన్ పావెల్ (32 బంతుల్లో 48; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. నికోలస్ పూరన్ (41; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), బ్రాండన్ కింగ్ (28; 4 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించారు. భారత బౌలర్లలో అర్ష్దీప్సింగ్, యుజ్వేంద్ర చాహల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 145 పరుగులకు పరిమితమైంది. తెలంగాణ కుర్రాడు తిలక్ వర్మ (22 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. ఓపెనర్లు శుభ్మన్ గిల్ (3), ఇషాన్ కిషన్ (6) విఫలమయ్యారు.
సూర్యకుమార్ యాదవ్ (21; 2 ఫోర్లు, ఒక సిక్సర్), కెప్టెన్ హార్ధిక్ పాండ్యా (19), సంజూ శాంసన్ (12), అక్షర్ పటేల్ (13) ప్రభావం చూపలేకపోయారు. ఒక దశలో 30 బంతుల్లో 37 పరుగులు చేయాల్సిన దశలో కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు సంజూ శాంసన్ క్రీజులో ఉండటంతో భారత్కు పెద్దగా ఇబ్బంది లేదనిపించింది. అయితే 16వ ఓవర్ హోల్డర్ తొలి బంతికే హార్దిక్ను వెనక్కి పంపగా.. మూడో బంతికి శాంసన్ రనౌటయ్యాడు. ఓవర్ మొత్తం ఒక్క పరుగు కూడా రాకపోవడంతో లక్ష్యం 24 బంతుల్లో 37కు చేరింది. ఆఖర్లో అర్ష్దీప్ సింగ్ (11; 2 ఫోర్లు) ఆశలు రేపినా అప్పటికే ఆలస్యమైపోయింది. విండీస్ బౌలర్లలో హోల్డర్, మెక్కాయ్, షెఫర్డ్ తలా రెండు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్ ద్వారా తిలక్తో పాటు పేసర్ ముఖేశ్ కుమార్ అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేశారు. ముఖేశ్ ఇదే పర్యటనలో టెస్టులతో పాటు వన్డేల్లోనూ అంతర్జాతీయ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. విండీస్ ఆల్రౌండర్ హోల్డర్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఆదివారం రెండో టీ20 జరుగనుంది.
అంతర్జాతీయ స్థాయిలో ఎదుర్కొన్న రెండో బంతికే సిక్సర్ కొట్టిన తిలక్ వర్మ.. ఆ మరుసటి బంతికి కూడా అదే ఫలితం రాబట్టి తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. దేశవాళీల్లో మెరుగైన ప్రదర్శన చేయడంతో పాటు.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున రెండు సీజన్లలో ఆకట్టుకున్న తిలక్ వర్మ.. జాతీయ జట్టు తరఫున ఆడిన తొలి మ్యాచ్లోనే సత్తాచాటాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు టీమ్ఇండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా చేతుల మీదుగా జాతీయ జట్టు క్యాప్ అందుకున్న తిలక్ వర్మ.. క్రీజులో ఉన్నంతసేపు పూర్తి సాధికారతతో బ్యాటింగ్ చేశాడు. 28 పరుగులకే రెండో వికెట్ కోల్పోయిన దశలో క్రీజులో అడుగుపెట్టిన తిలక్.. సూర్యకుమార్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు నడిపాడు. ఆడుతున్నది తొలి మ్యాచే అయినా ఏమాత్రం ఒత్తిడికి గురవకుండా.. ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు.
వెస్టిండీస్: 149/6 (పావెల్ 48, పూరన్ 41; చాహల్ 2/24, అర్ష్దీప్ 2/31),
భారత్: 20 ఓవర్లలో 145/9 (తిలక్ 39, సూర్య 21; హోల్డర్ 2/19, మెక్కాయ్ 2/28).