ఢిల్లీ: స్వదేశంలో వెస్టిండీస్తో టెస్టు సిరీస్ ఆడుతున్న టీమ్ఇండియా (Team India) శుక్రవారం నుంచి ఆ జట్టుతో సిరీస్లో ఆఖరిదైన రెండో మ్యాచ్లో తలపడనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఇరుజట్ల మధ్య జరుగబోయే ఈ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను క్లీన్స్వీప్ చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్స్ (డబ్ల్యూటీసీ) 2025-27 సైకిల్లో పాయింట్లను పెంచుకునేందుకు మెన్ ఇన్ బ్లూకు ఇది సదావకాశం. అహ్మదాబాద్లో ముగిసిన తొలి టెస్టును మూడురోజుల్లోనే ముగించిన శుభ్మన్ గిల్ సేన.. ఫిరోజ్ షా కోట్లా లోనూ అదే మ్యాజిక్ను రిపీట్ చేయాలనే పట్టుదలతో ఉంది. ప్రత్యర్థి కంటే ఎన్నో రెట్లు మెరుగ్గా ఉన్న భారత్.. తొలి టెస్టులో ఆడిన జట్టులో మార్పుల్లేకుండానే బరిలోకి దిగనుంది. మరోవైపు ఉనికి కోసం పాకులాడుతున్న వెస్టిండీస్ ఈ మ్యాచ్లో అయినా కనీస పోటీనైనా ఇస్తుందా? లేక ఈ పోరు సైతం ఏకపక్షంగానే ముగుస్తుందా? అన్నది ఆసక్తికరం.
ఢిల్లీ టెస్టులో అందరి చూపు ఇద్దరు యువ ఆటగాళ్ల మీదే నిలిచింది. తమిళనాడు బ్యాటర్ సాయి సుదర్శన్, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిపై భారీ అంచనాలు పెట్టుకున్న టీమ్ మేనేజ్మెంట్.. ఢిల్లీలో ఈ ఇద్దరూ మెరుగైన ప్రదర్శన చేయాలని ఆశిస్తున్నది. మూడో స్థానంలో బ్యాటింగ్కు వస్తున్న సాయి.. ఇప్పటిదాకా ఆడిన ఏడు ఇన్నింగ్స్లలో 147 రన్స్ మాత్రమే చేశాడు. కానీ కెప్టెన్ గిల్, కోచ్ గంభీర్.. సాయి సామర్థ్యంపై నమ్మకముంచి పదేపదే అవకాశాలిస్తున్న నేపథ్యంలో అతడు ఇకనైనా నిరూపించుకోవడం అవశ్యకం. ఇంగ్లండ్లో కాస్తో కూస్తో ఫర్వాలేదనిపించిన అతడు అహ్మదాబాద్ టెస్టులో 7 రన్స్ మాత్రమే చేసి నిరాశపరిచాడు.
మరోవైపు ఆల్రౌండర్ కోటాలో జట్టులోకి వచ్చిన నితీశ్ రెడ్డి.. తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఇది మంచి అవకాశం. తొలి టెస్టులో అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినా బౌలింగ్లో 4 ఓవర్లే వేశాడు. రెండో టెస్టులో నితీశ్ను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపడమే గాక ఎక్కువ ఓవర్లు వేయించాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నది. ఇక జైస్వాల్, గిల్తో పాటు తొలి టెస్టు శతకవీరులు రాహుల్, వికెట్ కీపర్ జురెల్, ఆల్రౌండర్ జడేజాతో భారత జట్టు బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. బుమ్రా, సిరాజ్ పేస్ బాధ్యతలు మోయనుండగా జడ్డూ, కుల్దీప్, వాషింగ్టన్తో స్పిన్ విభాగం పటిష్టంగా ఉంది.
తొలి టెస్టులో దారుణంగా ఓడిన విండీస్.. ఢిల్లీలో అయినా భారత్కు ఎదురునిలుస్తుందా? అన్నది చూడాలి. మొదటి టెస్టులో ఆ జట్టు బ్యాటర్లలో ఒక్కరైనా కనీసం 40 పరుగుల మార్కునైనా అందుకోలేదు. మరి ఈ మ్యాచ్లో అయినా కరీబియన్ బ్యాటర్లు భారత బౌలర్ల జోరుకు అడ్డుకట్ట వేస్తారా? లేక గత మ్యాచ్ మాదిరిగానే దాసోహమవుతారా? అన్నది ఆసక్తికరం.