రెండే రెండు అడుగులు! 15 ఏండ్ల సుదీర్ఘ కల సాకారానికి. కోట్లాది మందిఅభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న వేళ టీ20 ప్రపంచకప్లో భారత్ కీలక సమరానికి సమరశంఖం పూరించింది. విజయమో, వీర స్వర్గమో అన్న రీతిలో ఇంగ్లండ్ భరతం పట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నది. అడిలైడ్ వేదికగా ఆంగ్లేయుల ఆట కట్టడి చేస్తూ ఆస్ట్రేలియా గడ్డపై కొత్త చరిత్ర లిఖించాలని కసితో ఉంది. కోహ్లీ, సూర్యకుమార్ సూపర్ఫామ్మీదున్న వేళ..ఇంగ్లిష్ బౌలింగ్ దాడిని తుత్తునియలు చేయాలని చూస్తున్నది. నాకౌట్ బలహీనతను అధిగమించేందుకు రోహిత్సేన పట్టుదలతోఉంది.సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ ఇంగ్లండ్ను మట్టికరిపించి దాయాది పాకిస్థాన్తో ‘వరల్డ్ వార్’కు భారత్ సై అంటున్నది. ఈ నేపథ్యంలో గురువారంమెగాటోర్నీ సెమీస్ పోరుకు మీరూ సిద్ధమైపోండి.
అడిలైడ్: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ పతాక సన్నివేశానికి చేరుకుంది. దాదాపు నెలరోజులుగా అభిమానులను అలరిస్తూ వస్తున్న మెగాటోర్నీలో ప్రపంచ విజేత ఎవరో మరో రెండు మ్యాచ్ల్లో తేలనుంది. ఇప్పటికే న్యూజిలాండ్ను ఓడించిన పాకిస్థాన్ ఫైనల్ చేరగా, ఇంగ్లండ్తో అమీతుమీకి భారత్ అస్త్రశస్ర్తాలతో సిద్ధమైంది. అన్నీ అనుకూలిస్తే అడిలైడ్లో రోహిత్సేన కొత్త చరిత్ర లిఖించడం ఖాయంగా కనిపిస్తున్నది. ఐసీసీ మెగాటోర్నీల్లో నాకౌట్ బలహీనతకు చరమగీతం పాడుతూ ఫైనల్లోకి దూసుకెళ్లాలని టీమ్ఇండియా ఆరాటపడుతున్నది. సూపర్-12లో వరుస విజయాల జోరును కొనసాగిస్తూ కీలకమైన సెమీస్లో ఇంగ్లండ్ను ఓడించేందుకు భారత్ పక్కా ప్రణాళికను ఎంచుకున్నది. విన్నింగ్ కాంబినేషన్ను కొనసాగిస్తూ పరిస్థితులకు అనుగుణంగా తగు మార్పులు ఉంటాయని ఇప్పటికే కెప్టెన్ రోహిత్ సూచనప్రాయంగా వెల్లడించిన నేపథ్యంలో తుది జట్టు ఎంపికపై ఆసక్తి నెలకొన్నది. మరోవైపు మెగాటోర్నీలో పడుతూలేస్తున్న ఇంగ్లండ్ ఇప్పటి వరకు స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేకపోయింది. ఐర్లాండ్తో అనూహ్య ఓటమితో కంగుతిన్న బట్లర్ గ్యాంగ్..న్యూజిలాండ్, శ్రీలంకపై విజయాలతో నాకౌట్ బెర్తు దక్కించుకుంది. ఆల్రౌండర్లతో పేపర్పై బలంగా కనిపిస్తున్న ఇంగ్లిష్ జట్టు..భారత్కు పోటీనిచ్చేందుకు పావులు కదుపుతున్నది. అడిలైడ్లో పరుగుల వరద పారించేందుకు ఇరు జట్ల బ్యాటర్లు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
2007ను తిరిగి పునరావృతం చేయాలని చూస్తున్న టీమ్ఇండియా అందుకు తగ్గట్లు ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తు చేస్తున్నది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో తొలి పోరులో చరిత్రాత్మక విజయంతో మొదలుపెడితే..నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, జింబాబ్వేపై విజయాలతో గ్రూపు-2లో టాప్లేపింది. కెప్టెన్ రోహిత్శర్మ ఫామ్ కలవరపెడుతున్నా..విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ పరుగుల రేసులో దూసుకెళుతున్నారు. ముఖ్యంగా ఇన్నాళ్లు ఫామ్లేక ఇంటాబయటా విమర్శలు ఎదుర్కొన్న విరాట్..ఆసీస్ గడ్డపై జూలు విదిల్చాడు. దాయాది పాక్తో మ్యాచ్లో ఆశలు అడుగంటిన వేళ ఒంటిచేత్తో గెలిపించి కింగ్ కోహ్లీ అన్న పేరును సార్థకం చేసుకున్నాడు. మరోవైపు మిస్టర్ 360గా మన్ననలు అందుకుంటున్న సూర్యకుమార్ తనదైన రోజున ఎంతటి ప్రత్యర్థినైనా ఎదుర్కొనే సత్తా ప్రదర్శించడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్ ఎవరిని తీసుకోవాలనే దానిపై టీమ్ మేనేజ్మెంట్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. మ్యాచ్ ఫినిషర్గా ముద్రపడ్డ కార్తీక్ను కొనసాగించేందుకు మొగ్గుచూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవారం నెట్స్లో కార్తీక్ తీవ్రంగా చెమటోడ్చగా, పంత్ నామమాత్రపు ప్రాక్టీస్ చేయడం దీనికి బలం చేకూరుస్తున్నది.
ఇంగ్లండ్ జట్టు గాయాలతో సతమతమవుతున్నది. గంటకు 150కి.మీల పైగా నిలకడగా బంతులు వేస్తున్న మార్క్ వుడ్ ఆడేది అనుమానంగా మారింది. గాయంతో బాధపడుతున్న వుడ్ ఫిట్నెస్పై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. బుధవారం నాటి ప్రాక్టీస్లో వుడ్ కేవలం రెండు ఓవర్లకే పరిమితమయ్యాడు. ఒకవేళ వుడ్కు మ్యాచ్ ఫిట్నెస్ లేకపోతే ఆల్రౌండర్ క్రిస్ జోర్డాన్ జట్టులోకి వచ్చే అవకాశముంది. మరోవైపు డేవిడ్ మలన్ తుది జట్టు ఎంపికై సందిగ్ధత కొనసాగుతున్నది. కొద్దిసేపు ప్రాక్టీస్కు పరిమితమైన మలన్ స్థానంలో ఫిల్ సాల్ట్ జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
భారత్: రోహిత్శర్మ (కెప్టెన్), రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్పాండ్యా, కార్తీక్/పంత్, అక్షర్పటేల్, అశ్విన్, భువనేశ్వర్, షమీ, అర్ష్దీప్సింగ్
ఇంగ్లండ్: బట్లర్(కెప్టెన్), హేల్స్, మలన్/సాల్ట్, స్టోక్స్, బ్రూక్, లివింగ్స్టోన్, మోయిన్ అలీ, సామ్ కరాన్, వోక్స్, జోర్డాన్, అదిల్ రషీద్.