ఢాకా: భారత్, బంగ్లాదేశ్ మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇవాళ జరుగుతున్న తొలి వన్డేలో టాస్ ఓడిన భారత జట్టు బ్యాటింగ్ చేస్తోంది. పిచ్పై తేమ ఉండటంతో ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే భారత్ బ్యాటర్లు పరుగులు రాబట్టడానికి తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తున్నది. ఈ క్రమంలో బంగ్లా బౌలర్లు భారత్ టాప్ ఆర్డర్ నడ్డి విరిచారు.
ఇన్నింగ్స్ ఆరో ఓవర్లోనే మెహిది హసన్ శిఖర్ ధవన్ (7)ను పెవిలియన్కు పంపగా, ఆ తర్వాత 11వ ఓవర్లో షకీబ్ అల్ హసన్ మూడు బంతుల వ్యవధిలో వెంటవెంటనే రోహిత్శర్మ, విరాట్ కోహ్లీల వికెట్లు పడగొట్టి భారత బ్యాటింగ్ ఆర్డర్ను కోలుకోలేని దెబ్బతీశాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరూ కలిసి నిదానంగా ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే 20వ ఓవర్ ఆఖరి బంతికి ఎబాదత్ హొస్సేన్ బౌలింగ్లో కీపర్కు క్యాచ్ ఇచ్చి శ్రేయాస్ అయ్యర్ ఔటయ్యాడు. దాంతో భారత్ 92 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.