ప్రపంచంలోని రెండు అత్యుత్తమ జట్ల మధ్య ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. చెన్నై వేదికగా భారత్, ఆస్ట్రేలియా బుధవారం నిర్ణయాత్మక మూడో వన్డేలో అమీతుమీ తేల్చుకునేందుకు సై అంటున్నాయి. మూడు మ్యాచ్ల సిరీస్లో చెరోటి గెలువడంతో సమమైన సిరీస్లో ఆఖరికి విజయం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ముంబైలో ఆసీస్పై టీమ్ఇండియా పైచేయి సాధిస్తే..విశాఖలో స్టార్క్ విజృంభణతో కంగారూలు భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత చిదంబరం స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ అభిమానులను అలరించడం ఖాయంగా కనిపిస్తున్నది.
చెన్నై: భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ విజేత ఎవరో బుధవారం తేలనుంది. నిర్ణయాత్మక మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ కైసవం చేసుకోవాలన్న పట్టుదలతో ఇరు జట్లు కనిపిస్తున్నాయి. దాదాపు మూడేండ్ల తర్వాత చిదంబరం స్టేడియంలో పూర్తి స్థాయి ప్రేక్షకుల సామర్థ్యంతో మ్యాచ్ జరుగనుంది. ఇందు కోసం రెండు జట్లు తమ వ్యూహ, ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. ఆధిక్యం చేతులు మారుతూ వస్తున్న సిరీస్లో ఆఖరి మ్యాచ్లో విజయం ఎవరి సొంతమవుతుందో చూడాలి. సొంతగడ్డపై ఈ ఏడాది ఆఖర్లో జరుగనున్న ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ టోర్నీకి ముందు ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకునేందుకు సిరీస్ విజయం దోహదపడనుంది. ఇదిలా ఉంటే విశాఖ వన్డే ఓటమితో ఒక రకంగా నైరాశ్యంలో ఉన్న టీమ్ఇండియా తిరిగి పుంజుకోవాలని చూస్తున్నది.
భారత బ్యాటింగ్పైనే ప్రధానంగా దృష్టి నెలకొన్నది. విశాఖలో జరిగిన రెండో వన్డేలో స్టార్క్ పేస్ ధాటికి సింగిల్ డిజిట్ స్కోర్లకే వెనుదిరిగిన టీమ్ఇండియా బ్యాటర్లు చెన్నైలో ఎలా రాణిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ వరుసగా రెండు మ్యాచ్ల్లో సున్నాలు చుట్టడం ఒకింత ఆందోళన కల్గిస్తున్నది. టీ20 ఫార్మాట్లో వినూత్న షాట్లతో ఇరుగదీసే సూర్య..వన్డేల్లో స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించడంలో విఫలమవుతున్నాడు. గాయపడ్డ శ్రేయాస్ అయ్యర్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన సూర్య వచ్చిన అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. ఇదిలా ఉంటే టాపార్డర్లో శుభ్మన్ గిల్, రోహిత్శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్లో ఉన్నా..పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేయలేకపోతున్నారు. ఆసీస్ పేసర్లు స్వింగ్ బౌలింగ్తో ఇబ్బందులకు గురిచేస్తున్నా..దీటుగా సమాధానమివ్వడంలో విఫలమవుతున్నారు. సంప్రదాయక స్పిన్కు చిరునామా అయిన చెన్నై పిచ్ స్పందించే దానిపై మన బ్యాటింగ్ తీరు ఆధారపడి ఉంది. స్పిన్ గాకుండా పేస్కు సహకరిస్తే..మరోమారు భారత్కు కంగారూ పేసర్ల నుంచి కష్టాలు తప్పకపోవచ్చు.
కీలకమైన మూడో వన్డేలో ఆసీస్ మార్పులు, చేర్పులతో బరిలోకి దిగే అవకాశముంది. స్టార్ బ్యాటర్లు డేవిడ్ వార్నర్, మ్యాక్స్వెల్ మ్యాచ్ ఫిట్నెస్ సాధిస్తే..తుది జట్టులోకి రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తున్నది. వార్నర్ జట్టులోకి వస్తే మిచెల్ మార్ష్ మిడిలార్డర్లో బ్యాటింగ్కు వచ్చే చాన్స్ ఉంది. టెస్టు స్పెషలిస్టు మార్నస్ లబుషేన్ను తప్పించనుండగా, ఒక వేళ స్పిన్కు సహకరిస్తే..జట్టులోకి ఆస్టన్ ఆగర్ రావచ్చు. వార్నర్, మ్యాక్స్వెల్ తుది జట్టులోకి వస్తే ఆసీస్ బ్యాటింగ్ మరింత బలోపేతం కానుంది. మరోవైపు స్టార్క్ విశాఖ వన్డే ప్రదర్శన పునరావృతం చేస్తే..భారత బ్యాటర్లకు ఇబ్బందులు ఎదురుకావచ్చు.
భారత్: రోహిత్శర్మ(కెప్టెన్), గిల్, కోహ్లీ, సూర్యకుమార్, రాహుల్, హార్దిక్పాండ్యా, జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్/సుందర్, షమీ, సిరాజ్
ఆస్ట్రేలియా: స్మిత్(కెప్టెన్), వార్నర్, హెడ్, మార్ష్, క్యారీ, గ్రీన్, మ్యాక్స్వెల్, స్టొయినిస్, సీన్ అబాట్/ఆగర్/ఎలీస్, స్టార్క్, జంపా