అమ్మాయిలు అదరగొట్టారు. సొంతగడ్డపై ఇటీవలే ఇంగ్లండ్ను మట్టికరిపించిన భారత మహిళల జట్టు.. ఇప్పుడు ఆస్ట్రేలియా పనిపట్టింది. ఇన్నాళ్లు ఊరిస్తూ వస్తున్న అపురూప విజయాన్ని అలవోకగా ఒడిసి పట్టింది. బ్యాటర్ల సమిష్టి ప్రదర్శనకు బౌలర్ల సహకారం తోడవడంతో టీమ్ఇండియా.. టెస్టు ఫార్మాట్లో తొలిసారి ఆసీస్పై విజయఢంకా మోగించింది!
India Women | ముంబై: భారత మహిళల జట్టు అద్భుతం ఆవిష్కరించింది. ఇప్పటి వరకు ఆసీస్పై టెస్టు గెలువని టీమ్ఇండియా.. ఇప్పుడు చరిత్రను తిరగరాస్తూ.. కంగారూలపై ఖతర్నాక్ విజయం నమోదు చేసుకుంది. ముంబై వేదికగా జరిగిన ఏకైక టెస్టులో భారత్.. 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. 28 ఏండ్ల భారత అమ్మాయిల క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియాపై ఇదే తొలి టెస్టు విజయం కావడం విశేషం. ఓవర్నైట్ స్కోరు 233/5తో నాలుగో రోజు ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా.. చివరకు 261 పరుగులకే ఆలౌటైంది. ఆదివారం 28 పరుగుల తేడాతో కంగారూలు మిగిలిన ఐదు వికెట్లు కోల్పోయారు.
తహిలా మెక్గ్రాత్ (73) టాప్ స్కోరర్ కాగా.. అనాబెల్ సదర్లాండ్ (27), ఆష్లే గార్డ్నర్ (7), జెస్ జాన్సన్ (9), అలానా కింగ్ (0), కిమ్ గార్త్ (4) ఎక్కువసేపు నిలువలేకపోయారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా 4, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, రాజేశ్వరి గైక్వాడ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 75 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. 18.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 75 పరుగులు చేసింది. స్మృతి మంధన (38 నాటౌట్) రాణించింది. రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 7 వికెట్లు పడగొట్టిన భారత స్పిన్నర్ స్నేహ్ రాణాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
2008లో ఆస్ట్రేలియాపై భారత పురుషుల జట్టు విజయం సాధించిన సమయంలో అప్పటి టీమ్ఇండియా సారథి మహేంద్రసింగ్ ధోనీ.. జట్టు సభ్యులెవరూ అతిగా సంబరాలు చేసుకోవాల్సిన పనిలేదని ముందే చెప్పి.. దాన్ని ఒక సాధారణ విజయంగా చిత్రీకరించగా.. ఇప్పుడు అమ్మాయిలు దాన్నే అనుసరించారు. ఇప్పటి వరకు కంగారూలపై ఒక్క టెస్టు విజయం కూడా సాధించకున్నా.. ఇక ముందు ఇది తరచూ జరుగుతుందనే రీతిలో మామూలుగా వ్యవహరించడం కొత్తగా అనిపించింది. ఇటీవల ఇంగ్లండ్పై రికార్డు స్థాయి విజయం సాధించిన హర్మన్ప్రీత్ కౌర్.. ఇప్పుడు ఆసీస్ను మట్టికరిపించింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఎలా ఉన్నా.. టెస్టుల విషయానికి వస్తే.. సొంతగడ్డపై తమను ఓడించడం చాలా కష్టం అని మన జట్టు నిరూపించింది. ఈ రెండు విజయాల్లోనూ సమిష్టి కృషి స్పష్టం కాగా.. ఇకపై మరిన్ని టెస్టు మ్యాచ్లు నిర్వహించే దిశగా బీసీసీఐకి కొత్త పని పెట్టింది.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 219;
భారత్ తొలి ఇన్నింగ్స్: 406;
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 261 (తహిలా మెక్గ్రాత్ 73, ఎలీసా పెర్రీ 45; స్నేహ్ రాణా 4/63);
భారత్ రెండో ఇన్నింగ్స్: 75/2 (స్మృతి మంధన 38 నాటౌట్; ఆష్లే గార్డ్నర్ 1/18)