Virat Kohli : సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచ కప్లో భారత జట్టు(Team India) కొదమసింహంలా ప్రత్యర్థి జట్లను బెంబేలెత్తిస్తోంది. ఎనిమిందట ఎనిమిది విజయాలతో దూసుకెళ్తున్న రోహిత్ సేన చివరి లీగ్ మ్యాచ్లో పసికూన నెదర్లాండ్స్ (Netherlands)ను ఢీకొట్టనుంది. న్యూజిలాండ్తో సెమీస్ పోరుకు ముందు ప్రాక్టీస్ మ్యాచ్లా.. ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో డచ్ జట్టుతో తలపడనుంది.
అయితే.. ఈ మ్యాచ్లో అందరి కళ్లన్నీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli)పైనే నిలిచాయి. ఈ ఛేజ్ మాస్టర్ వన్డే ఫార్మాట్లో 50 సెంచరీ కొడితే చూసి తరించాలని కోట్లాది మంది అభిమానులు అనుకుంటున్నారు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో 35వ పుట్టిన రోజు నాడే కోహ్లీ మరో క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు.
సఫారీ బౌలర్లను ఉతికారేస్తూ వన్డేల్లో 49వ సెంచరీ బాదాడు. ఆ శతకంతో ఆరాధ్య ఆటగాడు సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) రికార్డు సమం చేసిన విరాట్.. మరో మూడంకెల స్కోర్పై కన్నేశాడు. ఆదివారం బెంగళూరులో సొంత ప్రేక్షకుల సమక్షంలో 50 సెంచరీల మైలురాయికి చేరుకోవాలని భావిస్తున్నాడు. అదే జరిగితే.. వన్డేల్లో అత్యధిక సెంచరీల వీరుడిగా విరాట్ సరికొత్త చరిత్ర సృష్టిస్తాడు.
ఈ ఏడాది సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లీ మెగాటోర్నీలో శ్రీలంక, సఫారీలపై శతక గర్జన చేశాడు. మొత్తంగా 8 మ్యాచుల్లో రెండు శతకాలతో 543 రన్స్ చేశాడు. దాంతో, వన్డే ప్రపంచ కప్లో తొలిసారి 500 ప్లస్ పరుగులు ఖాతాలో వేసుకున్నాడు. 2011లో 282 పరుగులు చేసిన కోహ్లీ 2015 ఎడిషన్లో 305, 2019లో 443 రన్స్ చేశాడంతే.